గుడ్ బుక్ వ‌ర్సెస్ రెడ్ బుక్!

ఏపీలో ఇప్పుడు ‘బుక్కుల‌’  రాజకీయం పీక్ లెవిల్లో ఉంది. టీడీపీ నేత‌లు రెడ్ బుక్ లంటూ.. పెద్ద ఎత్తున రాజ‌కీయాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. రాష్ట్రంలో ఏం జ‌రిగినా బుక్కుల‌కు ప్రాధాన్యం పెరిగిపోయింది. అధికారుల బ‌దిలీల నుంచి స‌స్పెన్ష‌న్‌ల వ‌ర‌కు.. వైసీపీ నేత‌ల‌పై కేసుల నుంచి విమ‌ర్శ‌ల వ‌ర‌కు కూడా రెడ్ బుక్ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడు వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ కూడా ‘గుడ్ బుక్‌’ పేరుతో కొత్త సంస్కృతికి తెర‌దీశారు.

నిజానికి బుక్కుల సంస్కృతి టీడీపీతోనే ప్రారంభ‌మైంది. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో ప్ర‌స్తుత మంత్రి నారా లోకేష్‌.. రెడ్ బుక్ పేరును ప్ర‌స్తావించారు. అంతేకాదు.. అధికారులు, నాయ‌కుల పేర్ల‌ను రాసుకుంటున్నాన‌ని.. మంత్రుల పేర్లు కూడా ఉన్నాయ‌ని అప్ప‌ట్లోనే ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌, వైసీపీ హ‌యాంలో టీడీపీ నేత‌ల‌ను ఇబ్బంది పెట్టార‌ని.. చ‌ట్ట ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని ఆరోపిస్తూ.. ప‌లువురు ఐపీఎస్‌ల‌పైనా చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఆ త‌ర్వాత‌.. జోగి ర‌మేష్ వంటి మాజీ మంత్రుల‌పైనా కేసులు న‌మోదు కావ‌డం తెలిసిందే. ఇవ‌న్నీ.. రెడ్ బుక్‌లో ఉన్న పేర్లేన‌న్న‌ది వైసీపీ నేత‌లు చేసిన ఆరోప‌ణ‌. అయితే.. దీనిపై టీడీపీ మౌనంగా ఉంది. నారా లోకేష్ మాత్రం త‌ర‌చుగా రెడ్ బుక్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఔను.. రెడ్ బుక్ స‌జీవంగానే ఉంద‌ని.. దానిలో ఉన్న పేర్ల‌ను బ‌ట్టి చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని కూడా ఆయ‌న హెచ్చ‌రిస్తున్నారు. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో జ‌గ‌న్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ.. తాము గుడ్ బుక్ రాస్తున్నామ‌ని చెప్పారు.

ఆ పార్టీనేత‌లు, కార్య‌క‌ర్త‌లు మాత్ర రెడ్ బుక్ రాస్తున్నార‌ని, తాను మాత్రం గుడ్ బుక్ రాస్తున్న‌ట్టు చెప్పు కొచ్చారు. అయితే.. దీనివెనుక వ్యూహంఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం కూట‌మిస‌ర్కారు ఉండ‌డంతో ఏ అధికారి అయినా.. స‌ర్కారు పెద్ద‌ల మాటే వింటారు. ఇది వైసీపీకి సంక‌టంగా మారింది. కేసులు పెట్ట‌డం.. వేధించ‌డం వ‌చ్చే నాలుగేళ్ల‌లో పెరుగుతుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. దీంతో పార్టీల‌ప‌రంగా ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. అధికారులు మాత్రం జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్న హెచ్చ‌రిక‌ల‌ను జ‌గ‌న్ ఈ గుడ్‌బుక్ ద్వారా స్ప‌ష్టం చేసిన‌ట్టు అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ఇది ఏమేర‌కు వ‌ర్కవుట్ అవుతుందో చూడాలి.