బాబు చెప్పారు.. టీటీడీ చేసింది.. విష‌యం ఏంటంటే!

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం విష‌యంలో సీఎం చంద్ర‌బాబు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతున్నా రు. ఇటీవ‌ల వెలుగు చూసిన తిరుమ‌ల శ్రీవారి ప్ర‌సాదం ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారం అనంత‌రం చంద్ర‌బాబు ప‌టిష్ట‌మైన వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. దీనిలో భాగంగా ఎక్క‌డిక‌క్క‌డ భ‌క్తుల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని కార్య‌నిర్వ‌హ‌ణాధికారి(ఈవో) జె. శ్యామ‌ల‌రావును ఆదేశించారు. ల‌డ్డూ ప్ర‌సాదం నుంచి భోజ‌న ప్ర‌సాదాల వ‌ర‌కు కూడా భ‌క్తుల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవాల‌ని చెప్పారు.

భ‌క్తుల మ‌నోభావాలు.. వారి అభిప్రాయాలు తెలుసుకుని.. వాటికి అనుగుణంగా ముందుకు సాగాల‌ని కూడా అధికారుల‌కు చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు. ఈవిష‌యంలో టైం లేద‌ని.. ప‌నులు ఉన్నాయ‌ని త‌నకు చెప్ప‌వ‌ద్ద‌ని కూడా ఆదేశించారు. అంతే! ఈవో శ్యామ‌ల‌రావు రంగంలోకి దిగిపోయారు. ప్ర‌స్తుతం శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో చేతినిండా ఊపిరి స‌ల‌ప‌నంత‌గా ప‌ని ఉన్నా.. ఆయ‌న సామాన్య భ‌క్తుల మ‌ధ్య‌కు వ‌చ్చేశారు.

సోమ‌వారం ఉద‌యాన్నే ఆయ‌న పుష్క‌రిణి, వైకుంఠం క్యూకాంప్లెక్సుల‌లో విస్తృతంగా ప‌ర్య‌టించారు. ప్ర‌తి భ‌క్తుడి చెంత‌కు వెళ్లి.. ద‌ర్శ‌నం నుంచి వ‌స‌తుల వ‌ర‌కు.. ల‌డ్డూ ప్ర‌సాదం నుంచి అన్న‌సంత‌ర్ప‌ణ‌, క్యూలైన్ల‌లో ఇస్తున్న ప్ర‌సాదాలు, ఆహారం, టీ, కాఫీ వంటి వాటి గురించి కూడా చ‌ర్చించారు. వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ ప‌ల‌క‌రించి.. ప్ర‌సాదాల నాణ్య‌త‌పై ఆరా తీశారు. ఆయా వివ‌రాల‌ను శ్యామ‌ల‌రావు నోట్ చేసుకున్నారు. ఇలా.. చంద్ర‌బాబు చెప్పిన వెంట‌నే రంగంలో దిగి త‌మ అభిప్రాయాలు సేక‌రించ‌డం ప‌ట్ల భ‌క్తులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇవీ ఫిర్యాదులు-సూచ‌న‌లు

  • శ్రీవారిని క‌నీసం చూడ‌కుండానే తోసేస్తున్నార‌ని మెజారిటీ భ‌క్తులు ఫిర్యాదు చేశారు.
  • క్యూలైన్ల‌లో ఇస్తున్న ఆహారం నాణ్య‌త‌పై సందేహాలు వ్య‌క్తం చేశారు.
  • పాలు బాగున్నాయ‌ని.. కానీ, మ‌జ్జిగ‌ను పంపిణీ చేయ‌డం లేద‌ని అది కూడాఇస్తే బాగుంటుంద‌ని తెలిపారు.
  • పులిహోర‌లో మిరియాల పొడిని ఎక్కువ‌గా క‌లిపేస్తుండ‌డంతో చిన్నారులు తిన‌లేక పోతున్నార‌ని ఎక్కువ మంది ఫిర్యాదు చేశారు.
  • అన్న ప్ర‌సాద విత‌ర‌ణ బాగుంద‌ని చెప్పారు.
  • భ‌క్తులు క‌నీసం అర నిమిష‌మైనా శ్రీవారిని ద‌ర్శించుకునే వెసులుబాటు క‌ల్పించాల‌ని ఎక్కువ మంది కోరారు.