కొండా సురేఖ తర్వాత సమంతపై ఈయన కూడా

ఇటీవలే హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టిన ‘ఎన్’ కన్వెన్షన్ విషయమై ఇటీవల పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘ఎన్’ కన్వెన్షన్ కూలగొట్టకపోవడానికి.. సమంత విడాకులకు ముడిపెడుతూ కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఈ వ్యాఖ్యలను సినీ పరిశ్రమ ముక్త కంఠంతో ఖండించింది. రాజకీయంగా కూడా ఈ అంశం పెద్ద చర్చనీయాంశం అయింది.

ఈ వ్యవహారం కాస్త సద్దుమణుగుతున్న సమయంలో ఇప్పుడు బీజేపీ నేత రఘునందన్ రావు రంగంలోకి దిగారు. కొండా సురేఖ తరహాలోనే ఆయన కూడా మాట్లాడుతూ.. గత టీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. చేనేత గురించి ఏమీ తెలియని సమంత దానికి బ్రాండ్ అంబాసిడర్ కావడం వెనుక మతలబు ఉందని ఆయన మాట్లాడారు.

“ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడం అని ప్రభుత్వ అధికారులతో పాటు కోర్టు కూడా ఎప్పుడో ధ్రువీకరించింది. అయినా దాన్ని కూలగొట్టలేదు. 2014లో ఉమ్మడి ఏపీ హైకోర్టు ఎన్ కన్వెన్షన్ మీద సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలని కోరింది. అప్పుడు హెచ్‌ఎండీఏ సర్వే చేసి 2016లో నివేదిక ఇచ్చింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో మూడున్నర ఎకరాలు ఆక్రమించి ఈ నిర్మాణం చేశారని, ఇది అక్రమ కట్టడం అని అందులో పేర్కొన్నారు. అయినా అప్పటి ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని కూలగొట్టలేదు. అప్పుడే అక్కినేని వారి కోడలు సమంత చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అయింది. ఆమెకు చేనేత తెలవదు, చీర తెలవదు. ఆమెను తెచ్చి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ చేశారు. ఆ సంబంధాలేంటో వాళ్లకే తెలియాలి. అప్పుడున్న వాళ్లకు రంగుల లోకంతో ఉన్న రక్త సంబంధం ఏంటో వాళ్లు చెప్పాలి. అవన్నీ చెప్పి నా నోరు పాడు చేసుకోను” అని రఘునందన్ రావు ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.