సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టు షాక్

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA) కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టు భారీ షాకిచ్చింది. ఆ కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు హైకోర్టు ఆమోదం తెలపడంతో కర్ణాటక రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ముడా కేసులో దాఖలైన పిటిషన్‌లో విషయాలపై దర్యాప్తు చేయాల్సిన అవసరముందని కర్ణాటక హైకోర్టు తేల్చి చెప్పింది. సెప్టెంబర్ 12న ఈ కేసు విచారణ పూర్తి చేసిన హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఈ కేసులో తనపై దర్యాప్తునకు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని సిద్ధరామయ్య సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసును చట్ట ప్రకారం విచారణ జరపవచ్చని హైకోర్టు క్లారిటీనిచ్చింది. గవర్నర్ స్వతంత్ర నిర్ణయం తీసుకోవచ్చని జస్టిస్ ఎం నాగప్రసన్నతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. గవర్నర్ ఉత్తర్వుల ప్రకారం ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలని కోర్టు తెలిపింది. గవర్నర్ తీసుకున్న చర్యలో ఎలాంటి లోపం లేదని కోర్టు అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్యకు మైసూరులోని ఓ ప్రాంతంలో ముడా అక్రమంగా 14 ప్లాట్లను కేటాయించిందని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో, ఆ ఫిర్యాదు ప్రకారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ అనుమతినిచ్చారు. కానీ, అలా గవర్నర్ అనుమతినివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టులో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ‘రాజ్‌భవన్ చలో’ నిరసనకు పిలుపునిచ్చారు.

గవర్నర్ వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు. ఆ తర్వాత సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆ క్రమంలోనే గవర్నర్ ఉత్తర్వులను సీఎం సిద్దరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కు అనుకూలంగా హైకోర్టు తీర్పునివ్వడంతో సిద్దూ చిక్కుల్లో పడ్డట్లయింది. ఒకవేళ ఈ విచారణ జరిగితే కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసే అవకాశముందని తెలుస్తోంది. సిద్ధూ వారసుడిగా డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశముందని తెలుస్తోంది.