అమరావతికి మహర్దశ..చంద్రబాబు కీలక ప్రకటన

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలను త్వరలోనే కేంద్రానికి పంపబోతున్నామని చంద్రబాబు అన్నారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ భేటీలో ఇదుకు సంబంధించిన తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని చంద్రబాబు చెప్పారు. ఇక, అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటుపై కూడా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. న్యాయశాఖపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

జూనియర్ న్యాయవాదులకు ఏపీ సీఎం చంద్రబాబు తీపి కబురు చెప్పారు. ఇకపై, జూనియర్ లాయర్లకు ప్రతి నెలా 10 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలుబెట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. దాంతోపాటు జూనియర్ న్యాయవాదులకు శిక్షణ అకాడమీ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని చంద్రబాబు చెప్పారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా 100 ఎకరాల్లో లా కాలేజ్ ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు.

మరోవైపు, మైనార్టీ సంక్షేమ శాఖపై కూడా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ పూర్తి చేయాలని ఆదేశించారు. నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటుకు చంద్రబాబు నిర్ణయించారు. ఇక, మసీదులలో ఇమామ్ లకు 10 వేల రూపాయలు, మౌజన్ లకు 5 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. మైనార్టీలకు లబ్ధి చేకూరేలా వక్ఫ్ భూములను అభివృద్ధి చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.