లడ్డూపై చంద్రబాబువి నిరాధార ఆరోపణలు: ఎంపీ స్వామి

తిరుమల తిరుపతి ప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వు, నెయ్యిని ఉపయోగించిన వ్యవహారంపై దేశ వ్యాప్తంగా దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కోట్లాదిమంది హిందువులు, భక్తులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన సుప్రీంకోర్టులో పిల్ వేశారు.

లడ్డూ కల్తీ అయిందని చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని స్వామి ఆరోపించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై దర్యాప్తు జరిపేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును స్వామి కోరిన వైనం చర్చనీయాంశమైంది. ఇదే విషయాన్ని సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని, ప్రసాదం అపవిత్రమైంది, కలుషితమైంది అని ఆయన చేసిన వ్యాఖ్యలు కోట్లాదిమంది భక్తులలో ఆందోళన రేకెత్తించాయని స్వామి ఆరోపించారు. అందుకే, ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించేలాగా సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశానని ఆయన చెప్పారు.

అయితే, తిరుమల లడ్డూ వ్యవహారంలో ఫైర్ బ్రాండ్ లీడర్ స్వామి ఎంటర్ కావడంపై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. స్వామి వ్యాఖ్యలను వైసీపీ అనుకూల వర్గం తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. చంద్రబాబు ఆరోపణలు నిరాధారమైనవని వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారని, అదే విషయం ఇప్సుడు స్వామి చెబుతున్నారని పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా చంద్రబాబుపై స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చంద్రబాబు వ్యాఖ్యలపై స్వామి స్పందించిన తీరు హాట్ టాపిక్ గా మారింది.