టీడీపీలో కొత్త ర‌చ్చ‌.. మంత్రి ప‌ద‌వుల కోస‌మేనా?

ఏపీలో కూట‌మికి నేతృత్వం వ‌హిస్తున్న టీడీపీలో మ‌రో కొత్త ర‌చ్చ తెర‌మీదికి వ‌చ్చింది. సీనియ‌ర్ నాయ‌కులు ఎవ రూ పార్టీకి స‌హ‌క‌రించ‌డం లేద‌న్న‌ది ప్ర‌స్తుతం వినిపిస్తున్న మాట‌. దీనిపై పెద్ద ఎత్తున పార్టీలో చ‌ర్చ కూడా సాగుతోంది.

వ‌రద ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు జిల్లాల వారీగా విరాళాలు సేక‌రించాల‌ని సీఎం చంద్ర‌బాబు పార్టీ నాయ‌కుల‌కు పిలుపునిచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మంది పారిశ్రామిక వేత్త‌లు, సినీరంగానికి చెందిన వారు.. ఇత‌ర ప్ర‌ముఖులు కూడా.. విరాళాల రూపంలో న‌గ‌దు అందిస్తున్నారు.

అయితే.. జిల్లాల స్తాయిలో నాయ‌కులు సేక‌రించాల్సిన నిధులపై ఢిల్లీకి వెళ్తూ వెళ్తూ.. సీఎం చంద్ర‌బాబు స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా జిల్లాల నుంచి సీనియ‌ర్ నాయ‌కులు పెద్ద‌గా ఈ విష‌యంపై దృష్టి పెట్ట‌లేదని నాయ‌కులు తేల్చి చెప్పారు. దీంతో చంద్ర‌బాబు ఖంగు తిన్నారు.

వ్య‌క్తిగ‌తంగానూ ఇవ్వ‌క‌… ప్ర‌జ‌ల నుంచి కూడా స‌మీక‌రించ‌క‌పో తే.. ఎలా! ఈ విష‌యంపై చ‌ర్చించండి! అని ఆదేశించి ఆయ‌న ఢిల్లీ వెళ్లిపోయారు. దీంతో క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల కు సీనియ‌ర్లు ఫోన్లు చేయ‌డం ప్రారంభించారు.

దీనికి చాలా మంది నాయ‌కులు నిరాశా, నిస్పృహ‌లు వ్య‌క్తం చేశార‌ట‌. త‌మ ప‌రిస్థితి కూడా జిల్లాల స్తాయిలో అలానే ఉంద‌ని.. అందుకే అడ‌గ‌లేక‌పోయామ‌ని వారు చెప్పిన‌ట్టు తెలిసింది. అనంత‌పురం, క‌ర్నూలు, క‌డ‌ప‌, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌, నెల్లూరు జిల్లాల‌కు చెందిన నాయ‌కులు అత్యంత నిరాశ‌గా స‌మాధానం చెప్పారు.

తాము ఏమీ చేయ‌లేక పోతున్నామ‌ని వారు తేల్చి చెప్పారు. ఇక‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాలకు చెందిన సీనియ‌ర్లు మాత్రం కొంత బెట‌ర్ అనిపించారు. అలాగే.. కృష్ణా, గుంటూరు జిల్లాల నాయ‌కులు విరాళాలు బాగానే సేక‌రించారు.

దీనికి కార‌ణం.. సీఎం చంద్ర‌బాబు ప‌క్క‌నే ఉంటారు కాబ‌ట్టి. మిగిలిన వారు మాత్రం.. మౌనంగా ఉన్నారు. పెద్ద పెద్ద నాయ‌కులు కూడా ఎవ‌రూ ఈ బాధ‌ను త‌మ బాధ‌గా భావించ‌డం లేద‌ని సీనియ‌ర్లు గుర్తించారు. దీనికి సంబంధించి చంద్ర‌బాబు ఢిల్లీ నుంచి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆయ‌న‌కు చెప్ప‌నున్నారు. అయితే.. అసలు కార‌ణం వేరే ఉంద‌ని.. త‌మ‌కు మంత్రివ‌ర్గంలో చోటు ఇవ్వ‌లేద‌న్న ఆవేద‌న వారిలో క‌నిపిస్తోంద‌ని సీనియ‌ర్ల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది.

అనంత‌పురంలో సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టారు. క‌ర్నూలులోనూ ఇదే జ‌రిగింది. ఇలా నాయ‌కులు మౌనంగా ఉన్న ప్ర‌తి జిల్లాలోనూ జూనియ‌ర్లే మంత్రులుగా ఉన్నారు. ఈ కార‌ణంగానే విరాళాల సేక‌ర‌ణ‌కు వారు మొగ్గు చూప‌న‌ట్టు తెలుస్తోంది.