ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు.. వెతుకుతున్న పోలీసులు

అత్యాచారం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు న‌మోదు చేశారు. బాధితురాలు, టీడీపీ మ‌హిళా నాయ‌కురాలు ఫిర్యాదు మేరకు ఆదిమూలంపై సెక్స్ వల్ హెరాస్ మెంట్, పోస్కో చ‌ట్టం కింద కేసులు న‌మోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. తిరుప‌తిలోని భీమాస్ పారడైజ్ రూమ్ నంబర్ 105, 109లో త‌న‌ ప్రమేయం లేకుండానే ఆదిమూలం ప‌లు మార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు.

దీంతో ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబ‌రు 430/2024తో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదేస‌మ‌యం లో భీమాస్ పారడైజ్ హోటల్ లో సి.సి. టీవీ పుటేజీ సేకరించారు. అదేస‌మ‌యంలో హోట‌ల్ య‌జమాని పైనా కేసు పెట్టిన‌ట్టు తెలిపారు. మ‌రోవైపు టీడీపీ ఇప్ప‌టికే ఆదిమూలంను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిం ది. ఆయ‌న‌పై అంత‌ర్గ‌త విచార‌ణ‌కు పార్టీ క‌మిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీని నియ‌మించిన రెండు రోజుల్లోనే నివేదిక ఇచ్చేలా చూస్తామ‌ని.. పార్టీ ఏపీ అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీనివాస‌రావు తెలిపారు.

ఇదిలావుంటే, త‌న‌పై అత్యాచార ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆదిమూలం త‌న కుమారుడితో స‌హా.. అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు. అయితే.. ఆయ‌న చెన్నైలో ఉన్నార‌న్న స‌మాచారం మేర‌కు ఒక బృందం పోలీసులు.. అక్క‌డ‌కు వెళ్లి ఆయ‌న కోసం వెతుకుతున్నారు. ఇక‌, ఆదిమూలం వ్య‌వ‌హారాన్ని స్థానిక టీడీపీ నాయ‌కులు తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నారు. ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌డం కాదు.. ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రోవైపు.. త‌మ‌పై కుట్ర చేశార‌ని.. వైసీపీ నాయ‌కులు ఉన్నార‌ని.. ఆదిమూలం కుటుంబ స‌భ్యులు ముఖ్యంగా ఆయ‌న కుమార్తెలు ఇద్ద‌రు చెబుతున్నారు. త‌మ‌ను కావాల‌నే ఇరికించార‌ని.. త‌మ తండ్రి 50 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఎలాంటి మ‌చ్చ లేకుండా జీవించార‌ని వారు చెబుతున్నారు. దీంతో తిరుప‌తి టీడీపీలో ఆదిమూలం వ్య‌వ‌హారం ఉత్కంఠ‌గా మారింది. చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.