టీడీపీ … బ్యాక్ టు బీసీ !

లోక్ సభ నియోజకవర్గాలకు తెలుగుదేశంపార్టీ నియమించిన అధ్యక్షుల్లో పదిమంది బిసీలే ఉన్నారు. పార్టీని పటిష్టంచేసే క్రమంలో ఇపుడున్న జిల్లాల అధ్యక్షుల స్ధానంలో ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేయాలని డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే 13 జిల్లాల అధ్యక్షుల స్ధానంలో చంద్రబాబునాయుడు 25 మంది అధ్యక్షలను నియమించారు. వీరిలో 10 చోట్ల బీసీలనే నియమించారు. ఇందులో కూడా ప్రధానంగా యాదవులకే ప్రాధన్యత ఇవ్వటం గమనార్హం. ఇంతమంది బీసీలకు ప్రాధాన్యత ఎందుకు ఇచ్చినట్లు ? ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో పార్టీకి దూరమైన బీసీలను మళ్ళీ దగ్గర చేసుకునే వ్యూహమే కనిపిస్తోంది.

అధ్యక్షులుగా నియమితులైన వారిలో 10 మంది బీసీలతో పాటు ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఒక ముస్లిం మైనారిటి నేత ఉన్నారు. మిగిలిన 11 మంది అధ్యక్షులను అగ్రవర్ణాల వారితో భర్తీ చేశారు. అంటే 25 అధ్యక్ష పదవుల్లో సగానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటిలకు ప్రాధాన్యత ఇచ్చినట్లయ్యింది. టిడిపి ఏర్పాటు చేసినప్పటి నుండి పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న బీసీలు ఒక్కసారిగా దూరమైపోయారు. అంటే నూటికి నూరుశాతం దూరమైనట్లు కాదు కానీ బలమైన సెక్షన్ దూరమైన మాట మాత్రం వాస్తవమే.

పార్టీకి మద్దతుగా నిలుస్తున్న బీసీలు దూరమైపోవటంలో చంద్రబాబు స్వయంకృతమే ఎక్కువుంది. అధికారంలో ఉన్న ఐదేళ్ళల్లో చేతులారా సామాజికవర్గాన్ని దూరం చేసుకున్నారు. వివిధ అవసరాల కోసం తన దగ్గరకు వచ్చిన వాళ్ళని కసిరికొట్టడం, అందరిముందు అవమానిస్తు మాట్లాడటం, అక్కడక్కడ ఒకరిద్దరు నేతలపై చేయి చేసుకోవటం లాంటి సంఘటనలు జరిగాయి. అవి చిన్నవే కావచ్చు కానీ అలాంటి అవకాశాల కోసం కాచుకుని కూర్చున్న ప్రతిపక్ష వైకాపా వాటిని బలంగా వాడుకుంది. దీంతో అలాంటి సంఘటనలకు విస్తృత ప్రచారం లభించింది. దీంతో పాటు కమ్మ నాన్ కమ్మ విబజనకు వైకాపా బలమైన బీజాలు నాటింది. ఈ కారణాల వల్ల 10-20 శాతం బీసీలు పార్టీకి దూరమయ్యారు. ఫలితంగా గంప గుత్తగా టిడిపికి పడుతున్న బీసీల ఓట్లలో గణనీయమైన చీలిక వచ్చి కొన్ని ఓట్లు వైసిపికి పడ్డాయి. దాని ఫలితమే టిడిపికి ఘోర ఓటమి.

ఇక కార్యవర్గంలో చూస్తే ఈ పదిమంది బీసీల్లో విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి అధ్యక్షులుగా యాదవులను నియమించారు. శ్రీకాకుళంలో కళింగ, విజయనగరంలో తూర్పుకాపు, అనకాపల్లిలో గవర, అమలాపురంలో శెట్టిబలిజ, మచిలీపట్నంలో గౌడ, అనంతపురం బోయ, హిందుపురంలో కురబ ఉప సామాజికవర్గాల నేతలు అధ్యక్షులుగా నియమితులయ్యారు. బీసీలకు ఒక్కసారిగా ఎందుకింత ప్రాధాన్యతంటే దూరమైన సామాజికవర్గాలను మళ్ళీ దగ్గరకు తీసుకునే వ్యూహంగానే కనబడుతోంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డేమో బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సమయంలో బీసీల్లోని అనేక సామాజికవర్గాల కోసం పథకాలు అమలు చేస్తున్నారు. మరి చంద్రబాబు అనుసరిస్తున్న బీసీల వ్యూహం ఫలిస్తుందా ?