చంద్ర‌బాబుకు బాల‌య్య విన్న‌పం.. !

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు, టీడీపీ నేత‌, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌లు బావ‌, బావ‌మ‌ర‌దులు అన్న విష‌యం తెలిసిందే. అంతేకాదు.. వీరు స్వ‌యానా వియ్యంకులు కూడా. తాజాగా.. బావ చంద్ర‌బాబును బాల‌య్య‌.. ఓ కోరిక కోరారు. నిజానికి ఎప్పుడూ.. ఆయ‌న చంద్ర‌బాబును ఏమీ కోరినట్టు వార్త‌లు కానీ.. వ్యాఖ్య‌లు కానీ వినిపించ‌లేదు. గ‌తంలో ప‌దేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా.. ఇది చేయండి.. అది చేయండి.. అని ఎప్పుడూ చంద్ర‌బాబును కోరిన దాఖ‌లా లేదు.

2014-19 మ‌ధ్య చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనూ బాల‌య్య ఎలాంటి కోరిక కూడా కోరలేదు. అయితే.. తాజాగా కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. తాజాగా ఒక పెద్ద కోరిక‌నే ఆయ‌న బావగారి ముందు పెట్టారు బాల‌య్య‌. 2019-22 మ‌ధ్య వైసీపీ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని 13 జిల్లాల‌ను విభ‌జించి 26 జిల్లాలుగా మార్చిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాను విభ‌జించి.. శ్రీస‌త్య సాయి జిల్లాగా ఏర్పాటు చేసింది. అయితే.. దీనికి జిల్లా కేంద్రంగా పుట్ట‌ప‌ర్తిని ప్ర‌క‌టించింది.

అప్ప‌ట్లోనే దీనిని వ్య‌తిరేకిస్తూ.. స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేశారు. కానీ, వైసీపీ స‌ర్కారు మాత్రం వీరి విన్న‌పాల‌ను ప‌ట్టించుకోలేదు. ఇక‌, అదేస‌మ‌యంలో ఎమ్మెల్యేగా ఉన్న బాల‌య్య కూడా ఆందోళ‌న కారుల‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ స‌ర్కారు ప‌ట్టించుకోలేదు. ఈ నేప‌థ్యంలోతాజాగా అన్న క్యాంటీన్‌ను ప్రారంభించేందుకు హిందూపురం వ‌చ్చిన బాల‌య్య‌కు ఇక్క‌డి వారు ‘హిందూపురాన్ని’ జిల్లా కేంద్రంగా చేయాల‌ని విన్న‌వించారు.

దీంతో ఇదే విష‌యంపై బాల‌య్య‌..చంద్ర‌బాబును అభ్య‌ర్థించారు. శ్రీస‌త్యసాయి జిల్లా కేంద్రంగా ప్ర‌స్తుతం ఉన్న పుట్ట‌ప‌ర్తిని ర‌ద్దు చేసి.. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాల‌ని ఆయ‌న మీడియా ముఖంగా విన్న‌వించారు. అనంత‌రం రెండు అన్నా క్యాంటీన్ల‌ను బాల‌య్య ప్రారంభించారు. సంక్షేమానికి, పేద‌ల అభ్యున్న‌తికి టీడీపీ పుట్టినిల్ల‌ని త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు. పేద‌ల కోసం.. ఆనాడు అన్న‌గారు ఎన్టీఆర్ రూ.2 కే బియ్యం ఇస్తే.. ఇప్పుడు చంద్ర‌బాబు రూ.5కే వారికి భోజ‌నం అందిస్తున్నారని కొనియాడారు.