సిస్ట‌మాటిక్ గ్యాప్‌లో చంద్ర‌బాబు!

సీఎం చంద్ర‌బాబు.. ఒక వ్య‌వ‌స్థీ కృత గ్యాప్‌లో ప‌డిపోయిన‌ట్టు తెలుస్తోంది. చీమ చిటుక్కుమ‌న్నా తెలిసే సాంకేతిక‌త ఆయ‌న సొంతం. అయితే.. ఇది నిన్న‌మాట‌. ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన ఓ వ్య‌వ‌హారం.. ఆయ‌న‌కు.. ప్ర‌జ‌ల‌కే కాదు.. ప్ర‌ముఖల‌కు మ‌ధ్య గ్యాప్ పెంచేస్తున్న‌వారు ఉన్న‌ట్టుగా అర్థ‌మ‌వుతోంది. ప్ర‌ముఖ ఉద్య‌మ కారిణి, ప్ర‌జ్వ‌ల సంస్థ నిర్వాహ‌కురాలు సునీతా కృష్ణ‌ణ్ చేసిన ట్వీట్ చూస్తే.. చంద్ర‌బాబు వ‌ర‌కు కొన్ని విష‌యాలు చేర‌డం లేద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌హిళ‌ల‌ను వ్య‌భిచార కూపం నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన ప్ర‌జ్వ‌ల సంస్థ ద్వారా సునీతా కృష్ణ‌న్ ద‌క్షిణాదిలో మంచి పేరు సంపాయించుకున్నారు.

చంద్ర‌బాబు సీఎం అయిన త‌ర్వాత‌.. ఆమె ఆయ‌న‌ను క‌లుసుకునేందుకు, రాష్ట్రంలో మ‌హిళ‌ల పురోభివృద్ధిపై చర్చించేందుకు నిర్ణ‌యించుకున్న‌ట్టు ఆమె చేసిన తాజా ట్వీట్‌తో తెలిసింది. అయితే.. ఇప్ప‌టికి ప‌లు మార్లు ఆమె ప్ర‌య‌త్నించిన‌ట్టు తెలిపారు. అయితే..చంద్ర‌బాబు అప్పాయింట్ మెంటు మాత్రం ఆమెకు ల‌భించ‌లేదు. అస‌లు ఈ విష‌యం చంద్ర‌బాబు వ‌ర‌కు చేర‌లేద‌ని కూడా.. ఆమె చేసిన ట్వీట్‌ను బ‌ట్టి తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో నేరుగా చంద్ర‌బాబు ట్విట‌ర్‌కే ఆమె పోస్టు పెట్టారు. త‌ను క‌ల‌వాల్సి ఉంద‌ని, త‌గిన స‌మ‌యం కేటాయిస్తే.. 10 నిమిషాలు చ‌ర్చించాల్సిన అంశాలు ఉన్నాయ‌ని అందులో పేర్కొన్నారు.

దీనికి చంద్ర‌బాబు సానుకూల‌త వ్య‌క్తం చేశారు. ఇదేస‌మ‌యంలో అప్పాయింట్ మెంటు వ్య‌వ‌హారంలో జ‌రిగిన లోపాల‌ను స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేస్తాన‌ని కూడా వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే.. వాస్త‌వానికి చంద్ర‌బాబుకు అప్పాయింట్‌మెంటు క‌ల్పించే విష‌యంలో జీఏడీ(సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌) చూడాలి. కానీ, అది ప‌క్క‌కుపోయి.. ఇప్పుడు పార్టీ కీల‌క నాయ‌కులు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో ఈ గ్యాప్ పెరుగుతున్న‌ట్టు స‌మాచారం.

ఇలా ఎంత మంది ఆయ‌న‌ను క‌లుసుకునేందుకు వ‌చ్చి.. అప్పాయింట్‌మెంటు ల‌భించ‌క వెనుదిగార‌నే విష‌యంపై సీఎంవో వ‌ర్గాలు దృష్టి పెట్టాయి. ఏదేమైనా ఇది వ్య‌వ‌స్థీకృత లోపంగానే అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నారు.