షర్మిళ, వైసీపీ.. డైరెక్ట్ ట్విట్టర్ వార్

కొన్నేళ్ల నుంచి వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిళ మధ్య తీవ్ర స్థాయిలో వైరం నెలకొన్న సంగతి తెలిసిందే. కుటుంబ స్థాయిలో ఉన్న గొడవలు రాజకీయంగానూ తీవ్ర విభేదాలుగా మారి.. షర్మిళ వేరు కుంపటి పెట్టుకున్నారు. ముందు తెలంగాణలో కొంత కాలం రాజకీయం చేసి.. ఈ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఏపీకి మారి.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారు. అప్పట్నుంచి జగన్, వైసీపీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఆమె మీద వైసీపీ వాళ్ళు కూడా ఎదురుదాడి చేస్తున్నారు.

అయితే ఎంతైనా జగన్ సోదరి కాబట్టి వైసీపీ ముఖ్య నేతలు ఆచి తూచే మాట్లాడతారు. సోషల్ మీడియాలో మాత్రం ఊరూ పేరు లేని వాళ్ళతో బూతులు తిట్టిస్తుంటారు అనే ఆరోపణలున్నాయి. అయితే షర్మిళ విమర్శలు ప్రస్తుతం మరింత పదునెక్కుతున్న నేపథ్యంలో డైరెక్టుగానే ఆమెను ఘాటు విమర్శలు చెయ్యడానికి వైసీపీ నేతలు, అధికారిక సోషల్ మీడియా హ్యండిల్స్ వెనుకాడట్లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఆమెపై యుద్ధానికి సై అన్నారు.

నిన్న సిగ్గు సిగ్గు అంటూ జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై షర్మిళ ఘాటుగా ఒక పోస్టు పెట్టింది. దానికి వైసీపీ హ్యాండిల్ నుంచి గట్టిగానే బదులిచ్చారు. “ఏజెంటుగా రాజకీయాలు చేసేవారికీ, ప్రజల తరఫున ప్రతి క్షణం ఆలోచించి వారికోసం పనిచేసే వారికీ మధ్య తేడా ఉంటుంది @realyssharmila గారూ. మీ మాటలు చూస్తే జగన్‌ గారి మీద ద్వేషమే కనిపిస్తోంది తప్ప, ప్రజా సమస్యలు ఎక్కడా కనిపించడం లేదు.

ప్రతిపక్షంలో ఉండి, మరో ప్రతిపక్షాన్ని తిడుతున్నారంటే… మీ అజెండా చంద్రబాబుకు మద్దతు పలకడం, జగన్‌ గారిని తిట్టడం. దివంగత మహానేత, మీ తండ్రి వైయస్ఆర్ విగ్రహాలను కాల్చేస్తుంటే.. ఎప్పుడైనా నోరు విప్పారా? రాష్ట్రంలో @JaiTDP హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసాలు చేస్తుంటే కనీసం ఒక్క మాటైనా మాట్లాడారా? పావురాల గుట్టలో పావురమైపోయాడని వైయస్ఆర్ మరణాన్ని అవహేళన చేసిన వారితో మీరు కలిసి నడవడం లేదా? తెలంగాణలో పుట్టా.. తెలంగాణలోనే ఉంటా అంటూ మాటలు చెప్పి.. అక్కడ నుంచి పారిపోయి ఇక్కడకు రాలేదా? మీకన్నా.. పిరికివాళ్లు, మీకన్నా స్థిరత్వం లేనివాళ్లు, మీకన్నా.. అహంకారులు, మీకన్నా స్వార్థపరులు ఎవరైనా ఉంటారా? ఇంతకీ మీరు పోస్టుచేసిన ట్వీట్‌ చంద్రబాబు దగ్గరనుంచి వచ్చిందా? లేక పక్క రాష్ట్రంలో ఉన్న ఆయన ఏజెంటు దగ్గర నుంచి వచ్చిందా?” అని ఈ పోస్టులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అయితే షర్మిళ ఊరుకోలేదు. మళ్ళీ దానికి బదులుగా ఇంకో ట్వీట్ చేసింది. “జగన్ మోహన్ రెడ్డి @ysjagan అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయండి అంటే మీకు నేను చంద్రబాబుకు కొమ్ము కాసినట్లు ఉందా..? మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి. అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే.. మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబే కనపడబడుతున్నాడు. సోషల్ మీడియాలో నన్ను కించపర్చేంత ద్వేషం మీకు ఉంది .. మాకు ద్వేషం లేదు. కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా..? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకు ఉంది. అది అధికార పార్టీనా.. లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదు. జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు కాబట్టే తప్పు అన్నాం! చట్ట సభను గౌరవించకపోవడం తప్పు! కాబట్టే రాజీనామా చేయమన్నాం!

వైఎస్సార్ విగ్రహాలు కూల్చేస్తే నేనే స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలను హెచ్చరించింది నేనే. అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈరోజు వైఎస్సార్ కి ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. అసలు వైసీపీలో వైఎస్సార్ గారిని, విజయమ్మను అవమానించినవారే కదా పెద్ద వాళ్లు.

@YSRCParty YSRCPలో YSRని ఎప్పుడో వెళ్లగొట్టారు కదా.. ఇప్పుడు ఉన్నది కేవలం Y అంటే వైవీ సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే ఉన్నారు. కనుక వైఎస్సార్ లాగా అసెంబ్లీలో పోరాడటం మీకు చేత కాదులే.. మీకు మీడియా పాయింటే ఎక్కువ. @yvsubbareddymp @SRKRSajjala @VSReddy_MP మీరు మాట్లాడుతున్న పక్క రాష్ట్రం తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీ రుణమాఫి చేసినందుకు గర్వపడుతున్నాం. మరి మీరు రైతులను నిలువునా మోసం చేసింది నిజం కాదా ? 3 వేల కోట్లతో ప్రతి ఏడాది ధరల స్థిరీకరణ నిధి అన్నారు. 4 వేల కోట్లతో ప్రతి ఏడాది పంట నష్ట పరిహారం అన్నారు.

ఇక వైఎస్సార్ జలయజ్ఞం పథకానికి తూట్లు పొడిచారు. మద్యపాన నిషేధం అని దగా చేశారు. మీ కంటే మోసగాళ్లు.. విశ్వసనీయత కోల్పోయిన వాళ్లు ఉంటారా..? మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువుణువునా పిరికితనం పెట్టుకున్న మీరు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను, వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీకి, తాకట్టుపెట్టారు ! మీ అహంకారమే మీ పతనానికి కారణం! మీ అహంకారమే మీ పతనానికి కారణం!” అని తన పోస్టులో షర్మిళ దీటుగా బదులిచ్చారు. మొత్తానికి పరిస్థితి చూస్తుంటే షర్మిళకు, వైసీపీకి మధ్య ఇకపై డైరెక్ట్ వార్ పెద్ద ఎత్తునే జరిగేట్లు ఉంది.