సంచ‌ల‌నం: ఏపీలో ఉద్యోగుల‌పై కేసుల ఎత్తివేత‌

ఏపీలో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. వైసీపీ హ‌యాంలో సీపీఎస్(కంట్రిబ్యూట‌రీ పింఛ‌న్ స్కీం)ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేసిన ఆందోళ‌న గురించి తెలిసిందే. రెండేళ్ల‌కుపైగానే వారు ఉద్య‌మించారు. ఈ నేప‌థ్యంలో సుమారు 4200 మందిపై కేసులు న‌మోద‌య్యారు. ఒక్కొక్క‌రిపై ప‌ది కేసులు న‌మోదైన వారు కూడా ఉన్నారు. అయితే.. తాజాగా ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఈ కేసుల‌ను ఎత్తివేస్తున్న‌ట్టు అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించింది.

గురువారం రాష్ట్ర శాంతి భ‌ద్ర‌త‌ల‌కు సంబంధించిన శ్వేత‌ప‌త్రాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్భంగా.. ఆయ‌న ఉద్యోగుల‌పై న‌మోదైన కేసుల వివ‌రాల‌ను స‌భ‌లో వివ‌రించారు. వారిపై అన్యాయంగా కేసులు పెట్టార‌ని.. కొంద‌రిపై 402 కేసులు పెట్ట‌గా.. మ‌రికొంద‌రు ప్ర‌భుత్వ ఆస్తుల విధ్వంసాల‌కు సంబంధించిన కేసులు స‌హా.. మ‌రికొంద‌రి 144 సెక్ష‌న్ ఉల్లంఘించిన నేరానికి కూడా కేసులు పెట్టారు. ఒక‌రిద్ద‌రిపై సంఘ విద్రోహులుగాముద్ర‌వేస్తూ.. కేసులు పెట్టిన‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు.

నిజానికి ఉద్యోగుల‌పై కేసులు పెట్టార‌న్న విష‌యం తెలుసుకానీ.. కొంద‌రు ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌పై సంఘ విద్రోహ శ‌క్తులుగా పేర్కొంటూ కేసులు న‌మోదు చేసిన విష‌యం తాజాగా చంద్ర‌బాబు చెప్పిన త‌ర్వాతే అంద‌రికీ తెలిసింది. అయితే.. ఆయా కేసుల‌ను అన్నింటినీ ఎత్తేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన విధి విధానాల‌పై త్వ‌ర‌లోనే జీవో ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపారు. దీంతో ఉద్యోగ సంఘాల నాయ‌కులు, ఉద్యోగులు కూడా.. హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వంలో సిపిఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు 4000 మందికిపైగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్ర‌బాబుకు, మంత్రి కొల్లు రవీంద్ర, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల నాయ‌కులు కూడా.. స‌ర్కారుకు కృత జ్ఞ‌త‌లు తెలిపారు.

ఏంటీ వివాదం..

సీపీఎస్ అనే పింఛ‌న్ విధానాన్ని 2004లో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చింది. దీనిని రాష్ట్రాలు అమ‌లు చేయాల‌ని చెప్పింది. అప్ప‌ట్లో అమ‌లు చేశారు. అయితే.. దీనివ‌ల్ల తాము న‌ష్ట‌పోతామ‌ని.. కాబ‌ట్టి ఓల్డ్ పింఛ‌న్ స్కీం(ఓపీఎస్‌)ను తీసుకురావాల‌ని అప్ప‌టి నుంచి ఉద్యోగులు ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు సీపీఎస్ ర‌ద్దు చేస్తాన‌ని హామీ ఇచ్చారు. కానీ, చేయ‌లేదు. దీంతో 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్‌.. తాను అధికారంలోకి వ‌చ్చిన వారంలోనే ర‌ద్దు చేస్తాన‌న్నారు. అయినా చేయ‌లేదు. దీంతో గ‌త రెండేళ్ల కింద‌ట రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. దీంతో వారిపై నిర్బంధాలు.. కేసులు పెట్టారు. ఇక‌, తాజా ఎన్నిక‌ల‌కు ముందు .. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏడాదిలోగా సీపీఎస్ కు ప‌రిష్కారంచూపిస్తామ‌ని హామీ ఇచ్చారు.