ఒక నేర‌స్థుడి కార‌ణంగా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాశనం..

ఒక నేర‌స్థుడి కార‌ణంగా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అరాచ‌కంగా త‌యారైంద‌ని సీఎం చంద్ర‌బాబు ప‌రోక్షంగా మాజీ సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో శాంతి భ‌ద్ర‌త‌ల‌పై శ్వేత ప‌త్రం విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. గ‌త వైసీపీ పాల‌న‌లో జ‌రిగిన ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. అన్నింటా జ‌గ‌న్ అనుచ‌రుల ప్ర‌మేయం ఉంద‌న్నారు. వైసీపీ నాయ‌కులు రెచ్చిపోయి.. మ‌రీ దాడులు చేసి.. ఎదురు కేసులు పెట్టి వేధించార‌ని తెలిపారు.

ఆల‌యాల విధ్వంసం: గ‌త వైసీపీ పాల‌న‌లో దేన్నీ వ‌ద‌ల‌లేద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. రామ‌తీర్థంలో రాముడి విగ్ర‌హం త‌ల లేపేశార‌ని.. విజ‌య‌వాడ దుర్గ‌మ్మ గుడిలో వెండి సింహాల‌ను మాయం చేశార‌ని, తిరుమ‌ల శ్రీవారి ఆల‌యంలో అన్య‌మ‌త ప్ర‌చారం చేశార‌ని చెప్పారు. చివ‌ర‌కు అంత‌ర్వేదిలో ర‌థాన్ని కూడా త‌గుల బెట్టార‌ని.. వీటిని ప‌రిశీలించేందుకు వెళ్లిన త‌న‌పైనా.. త‌న పార్టీ నాయ‌కులు అచ్చెన్నాయుడు, అశోక్ గ‌జ‌ప‌తి రాజు స‌హా అనేక మందిపై కేసులు పెట్టార‌ని అన్నారు.

గంజాయి: ఏపీ అంటే అభివృద్ధికి బ్రాండ్‌గా ఉండేద‌ని.. దీనిని వైసీపీ ప్ర‌భుత్వం ధ్వంసం చేసింద‌న్నారు. ఎక్క‌డ ఏ మూల గంజాయి దొరికినా.. దానికి మూలాలు ఏపీలోనే దొరికాయ‌ని.. దీంతో బ్రాండ్ దెబ్బ‌తినిపోయింద‌న్నారు. తాము.. ఇప్పుడు క‌ఠిన చ‌ర్య‌ల దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు చెప్పారు. యువ‌త‌ను గంజాయికి దూరంగా ఉంచ‌డంతోపాటు.. మ‌న్యంలో గంజాయి సాగును అరిక‌ట్టేందుకు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌న్నారు. వ‌చ్చే స‌భ‌లో దీనిపై ఒక రోజంగా చ‌ర్చ పెట్టి.. సూచ‌న‌లు తీసుకుంటామ‌న్నారు.

జ‌ర్న‌లిస్టుల‌పై దాడులు: వైసీపీ హ‌యాంలో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వార్త రాశార‌న్న కార‌ణంగా అనేక టీవీ చానెళ్లు, ప‌త్రికల విలేక‌రుల‌ను నిర్బంధించ‌డంతోపాటు కేసులు కూడా పెట్టార‌ని తెలిపారు. వాటిని ప‌రిశీలించి.. త‌దుప‌రి ఏం చేయాల‌న్న‌దానిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

రాజ‌కీయ హింస‌: రాష్ట్రంలో గ‌త ఐదేళ్ల కాలంలో రాజ‌కీయ హింస పెరిగిపోయింద‌ని చంద్ర‌బాబు చెప్పారు. త‌మ‌కు న‌చ్చ‌ని వారిని హింసించి.. పార్టీలు మారేలా చేశార‌ని అన్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో క‌నీసం నామినేష‌న్లు కూడా వేయ‌కుండా అడ్డుకున్నార‌ని తెలిపారు. అందుకే తాము త‌మ వారిని కాపాడుకునేందుకు నామినేష‌న్లు వేయ‌క‌పోయినా.. పోటీ లో లేక‌పోయినా.. ఫ‌ర్వాలేద‌ని భావించి ఏకంగా పోటీ కూడా చేయ‌కుండా నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు.

సోష‌ల్ మీడియాపైనా దాడులు: రంగనాయ‌క‌మ్మ అనే వృద్ధురాలు, సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు వంటి వారిని కూడా.. సోష‌ల్ మీడియాలో పోస్టులు ఫార్వ‌ర్డ్ చేశార‌న్న కార‌ణంగా అరెస్టులు చేశార‌ని తెలిపారు. అనేక మంది సోష‌ల్ మీడియా బాధితులు ఉన్నార‌ని.. వారంద‌రినీ ఏం చేయాల‌నే విస‌యాన్ని కూడా తాము ఆలోచిస్తామ‌న్నారు.

పోలీసుల‌తో వైసీపీ కుమ్మ‌క్కు: అంద‌రూ కాదు కానీ.. కొంద‌రు పోలీసులు వైసీపీ నాయ‌కుల‌తో అంట‌కాగి.. పోలీసు శాఖ ప‌రువు తీశార‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఇలాంటి వారిని ఇప్ప‌టికే దూరం పెట్టామ‌న్న ఆయ‌న‌.. ఎవ‌రూ రాజ‌కీయాల‌తో ముడి ప‌డి ప‌నిచేయొద్ద‌ని చెప్పుకొచ్చారు.