షర్మిలమ్మా ఇంత రిస్క్ అవసరమా

కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌.. వైఎస్ ష‌ర్మిల‌.. ఏపీలోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఆమె ప‌ర్య‌టించారు. ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని తాడేపల్లి గూడెం, నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అయితే.. ఈ స‌మ‌యంలో ఆమె న‌డుములోతు నీళ్ల‌లోకి దిగి మ‌రీ పంట‌ల‌ను ప‌రిశీలించడం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి అక్క‌డ నీరు త‌ప్ప‌.. పంట‌లు లేవు. అంటే.. కొట్టుకుపోయాయి. అయిన‌ప్ప‌టికీ.. రైతుల కోరిక మేర‌కు.. వ‌ర‌ద నీటిలోకి దిగి.. ఆమె నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నడుంలోతు నీళ్లలో దిగి వినూత్నంగా నిరసన చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల మాట్లాడుతూ.. రైతులు ఒక్కొక్క‌రూ.. వంద‌ల ఎక‌రాల్లో పంటలు న‌ష్ట‌పోయార‌ని తెలిపారు. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఉన్న‌ప్పుడు.. రైతుల‌ను ఆదుకున్నార‌ని.. మేనిఫెస్టోలో రైతు రుణ మాఫీ గురించి చెప్ప‌క‌పోయినా.. స్పందించి.. రైతుల‌కు రుణ మాఫీ చేశార‌ని తెలిపారు. ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా.. రుణ మాఫీ గురించి హామీ ఇవ్వ‌క‌పోయినా.. చేయ‌కూడ‌ద‌ని రూల్ లేద‌న్నారు.

రైతుల క‌ష్టాల‌ను చూసి.. ప్ర‌బుత్వం రుణ మాఫీ చేయాల‌ని ష‌ర్మిల డిమాండ్ చేశారు. పంట‌లు నిలువెత్తు లోతులో మునిగిపోయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ యంత్రాంగం క‌నీసం స్పందించ‌లేద‌ని ష‌ర్మిల దుయ్యబ‌ట్టారు. అందుకే తాను వ‌చ్చి.. రైతుల క‌ష్టాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు చెప్పారు. ప్ర‌బుత్వం ఇప్ప‌టికైనా స్పందించి రైతుల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఇదే స‌మ‌యంలో త‌న సోద‌రుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు.

ప‌క్క‌నే ఉన్న ఎర్ర‌కాలువ పొంగి పొర్ల‌డంతోనే వేలాది ఎక‌రాల పొలాలు నీట మునిగాయ‌ని చెప్పిన ష‌ర్మిల‌.. ఈ పాపం జ‌గ‌న్‌దేన‌ని అన్నారు. ఎర్ర‌కాలువ వ‌ర‌ద ఉద్రుతిని ఆపేలా వైసీపీ ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేద‌ని.. త‌ట్టెడు మ‌ట్టి కూడా.. ఎత్తిపోయ‌లేద‌ని.. ఈ కార‌ణంగానే పొలాలు మునిగిపోయి.. రైతులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు. ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మైనా.. రైతుల‌ను ఆదుకోవాల‌ని కోరారు. కాగా.. నడుములోతు నీళ్ల‌లోదిగి నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డంపై మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది.