జగన్ వార్నింగ్.. ఆయన పేరు అది కాదట

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో మోస్ట్ పవర్ ఫుల్ సీఎం అనే పేరుండేది. ఏకంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చి కొంత కాలం రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నట్లు కనిపించేవారాయన. కానీ తర్వాత ఆయన పాలన ఎలా తయారైందో, ఎన్ని విమర్శలు మూటగట్టుకున్నారో.. ఎంతటి అసమర్థ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారో తెలిసిందే. ఇక ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక ఎంత బలహీనంగా తయారయ్యారో చూస్తూనే ఉన్నాం.

ఐతే ఓటమితో బలహీన పడడం అందరు రాజకీయ నాయకుల్లో జరిగేదే కానీ.. జగన్ వ్యవహారం వేరుగా ఉంది. ఆయన సోషల్ మీడియాలో పెద్ద ట్రోల్ మెటీరియల్‌గా మరిపోతుండడమే విచిత్రం. జగన్ ఎప్పుడైనా బయటికి వచ్చాడంటే చాలు.. ఆయన మాటలు, చేష్టలు సోషల్ మీడియాలో పెద్ద ట్రోల్ మెటీరియల్‌గా మారిపోతుండడం గమనార్హం. ఓటమి తర్వాత ప్రెస్ మీట్ పెట్టినా.. పిన్నెల్లిని పరామర్శించేందుకు మాచర్ల వెళ్లినా.. హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని కలిసేందుకు వినుకొండ వెళ్లినా.. ఇలా ప్రతి చోటా ఆయన మాటలు ట్రోల్స్‌కు దారి తీశాయి.

నిన్న గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలిపేందుకు అసెంబ్లీకి వెళ్లిన సందర్భంగానూ ట్రోల్ మెటీరియల్ తక్కువగా ఏమీ రాలేదు. ప్లకార్డులు పట్టుకుని లోనికి వెళ్తున్న సందర్భంగా తమను పోలీసులు అడ్డుకున్నపుడు జగన్ వార్నింగ్ ఇస్తూ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఆ సందర్భంగా తన ఎదురుగా ఉన్న పోలీస్ అధికారిని ఉద్దేశించి ‘మధుసూదన్ రావు.. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు గుర్తుంచుకో’ అంటూ పేరు పెట్టి సంబోధించి వార్నింగ్ ఇచ్చాడు. కానీ తీరా చూస్తే ఆయన ఎదురుగా ఉన్న పోలీస్ పేరు మధుసూదన్ రావు కాదు, సుధాకర్ రావు అనే విషయం బయటికి వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో దీని మీద మీమ్స్ మోత మోగిపోతోంది.

స్క్రిప్ట్ పేపర్ లేకుంటే జగన్ పరిస్థితిదీ.. కనీసం పేరు కూడా సరిగా పలకలేడు అంటూ ఆయన్ని ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ప్లకార్డులతో లోనికి వెళ్లాలని చూడడం.. గవర్నర్ ప్రసంగానికి వ్యతిరేకంగా బాయ్‌కాట్ చేయడం లాంటి పరిణామాల విషయంలోనూ జగన్ అండ్ కోకు విమర్శలు తప్పట్లేదు. వైసీపీ అధికారంలో ఉండగా.. టీడీపీ ఇవే పనులు చేస్తే వాటి మీద కౌంటర్లు వేసి ఇప్పుడు వీళ్లు అదే పని చేయడంతో గట్టిగానే కౌంటర్లు పేలుతున్నాయి.