కొత్త ప‌న్ను విధానం ఇదే!

కేంద్రం తాజాగా ప్ర‌వేశ పెట్టిన ఏడుమాసాల బ‌డ్జెట్‌లో వేత‌న జీవికి ఊర‌ట పెద్ద‌గా ల‌భించ‌లేదు. పైగా.. కొత్త ప‌న్ను విధానంలోకి మారేందుకు ప్రోత్స‌హిస్తున్నామ‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించా రు. ఇప్ప‌టికే ఉన్న కొత్త ట్యాక్స్‌ విధానంలో పన్ను స్లాబ్‌లు మార్పులు చేస్తున్న‌ట్టు చెప్పారు. దీనిలో ప్ర‌ధానంగా కొంత మేర‌కు ఊర‌ట ఇచ్చే అంశం.. స్టాండర్డ్ డిడక్షన్‌ పెంపు మాత్ర‌మే. దీనిని 50 వేల నుంచి రూ.75 వేల వ‌ర‌కు పెంచారు.

ఇక‌, నూత‌న ప‌న్ను విదానంలో మాత్రం ఆదాయ ప‌న్ను ప‌రిమితిని 3 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు పెంచారు. ఆ త‌ర్వాతే.. ప‌న్ను ప‌రిదిలోకి రానున్నారు. అది ఎలాగంటే.. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5 శాతం, రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 10 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం, రూ.15 లక్షలకు మించి ఆదాయంపై 30 శాతం పన్ను వ‌ర్తిస్తుంది. అయితే.. పాత ప‌న్ను విదానంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయ‌లేదు.

ఇక‌, పింఛ‌ను విధానం.,.

ప్రస్తుతం 2004 త‌ర్వాత ఉద్యోగాలు పొందిన వారు.. సీపీఎస్‌(కంట్రిబ్యూట‌రీ పింఛ‌ను ప‌థ‌కం)ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో దీనిని అలానే ఉంచి.. కొన్ని రాష్ట్రాలు పాత పింఛ‌ను ప‌థ‌కాన్ని (ఓపీ ఎస్‌)ను అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా ఆ పింఛ‌ను ప‌థ‌కం అమ‌లు కాలే దు. ఏపీలో గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వం కూడా.. సీపీఎస్ ర‌ద్దు చేస్తామ‌ని చెప్పి చేయ‌లేదు. ఇది ప్ర‌భుత్వం ప‌డిపోయే ప‌రిస్థితి వ‌ర‌కు వ‌చ్చింది.

తాజాగా పింఛ‌ను పై స్పందించిన కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. సీపీఎస్ పేరు ఎత్త‌కుండానే ఎన్ పీఎస్‌(నేష‌న‌ల్ పింఛ‌న్ స్కీం)ను ప్ర‌క‌టించారు. దీనిని అమ‌లు చేసేందుకు తాము కృత నిశ్చ‌యంతో ఉన్నామ‌న్నారు. అయితే.. దీనిలోని లోపాల‌ను స‌వ‌రించేందుకు, అధ్య‌య‌నం చేసేందుకు నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. దీనివ‌ల్ల ప్ర‌భుత్వాల‌కు, ఉద్యోగుల‌కు ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. గ‌త బ‌డ్జెట్‌లోనూ ఇదే చెప్ప‌డం గ‌మ‌నార్హం.