రోజుకు 40 వేల టెస్టులేవి? ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

Corona In Telangana
Corona In Telangana

తెలంగాణలో కరోనా టెస్టులు, గణాంకాల, నివేదికల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని హైకోర్టు గతంలో పలుమార్లు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. కోర్టులంటే తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం లేదని, కరోనా కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని హైకోర్టు గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కరోనా గణాంకాలు, చికిత్స, ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక బిల్లులకు సంబంధించిన పలు పిటిషన్లపై నేడు విచారణ జరిపిన హైకోర్టు….మరోసారి కేసీఆర్ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలంగానలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారని, మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణ ఎందుకు వెనకబడి ఉందని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మహారాష్ట్రలో రోజుకు లక్షన్నర కరోనా పరీక్షలు చేస్తున్నారని, తెలంగాణలో రోజుకు 40 వేల పరీక్షలు చేస్తామన్న ప్రభుత్వ హామీ ఎందుకు అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

కరోనా పరీక్షల సంఖ్యను ఎందుకు తగ్గించారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య ఎందుకు లేదని, 1000 మందికి కనీసం మూడు బెడ్లు కూడా లేవని, మిగతా రాష్ట్రాల కన్నా ఎందుకు వెనకబడి ఉన్నారో తెలపాలని ఆదేశించింది. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ బెడ్లు పెంచే ప్రణాళికలు ఉన్నాయో లేదో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ల తదుపరి విచారణను అక్టోబరు 8కి వాయిదా వేసింది.కాగా, ప్రైవేట్‌ హాస్పటళ్లలో అధిక చార్జీలపై , 50శాతం బెడ్స్‌పై ఢిల్లీ మాదిరిగా వ్యవహరించాలని, తెలంగాణలో బెడ్స్ ఏ విధంగా ఏర్పాటు చేశారో నివేదిక ఇవ్వాలని, డిజాస్టార్ మేనేజ్మెంట్ ప్లాన్స్ , సంబంధిత చర్యలు తెలపాలని గత విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది. కరోనాకు సంబంధించిన కచ్చితమైన రిపోర్టులు సమర్పించాలనిగతంలో హెచ్చరించింది.