వైసీపీ చేజారిన విశాఖ‌.. సంచ‌ల‌నమే!

అధికారాన్ని కోల్పోయిన వైసీపీకి దెబ్బ‌ల‌పై దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఒక‌దాని త‌ర్వాత‌.. ఒక‌టిగా .. స్థానిక సంస్థ‌ల్లోనూ అధికారం పోతోంది. ఇప్ప‌టికే చిత్తూరు పోయింది. బ‌ల‌మైన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మాట‌ను కూడా.. ఇక్క‌డ ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఫ‌లితంగా చిత్తూరు మునిసిప‌ల్ కార్పొరేష‌న్ వారం రోజుల కింద‌టే.. కూట‌మి పార్టీలైన‌.. టీడీపీ, జ‌న‌సేన ప‌రం అయిపోయింది. ఇక‌, ఇప్పుడు విశాఖ వంతు వ‌చ్చింది. నిజానికి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా 2021లో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ భావించింది.. విశాఖ కార్పొరేష‌న్‌నే.

అనేక జిమ్మిక్కుల‌తో.. అనేక వ్యూహాల‌తో ఇక్క‌డ పాగా వేసింది. వైసీపీ కీల‌క నాయ‌కుడు విజ‌య‌సాయిరెడ్డి పాద‌యాత్ర చేసి మ‌రీ.. ఇక్క‌డ కార్పొరేష‌న్‌లో వైసీపీ గెలిచేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అప్ప‌టి ఆంధ్రాయూనివ‌ర్సిటీ వైఎస్ చాన్స‌ల‌ర్ ప్ర‌సాద‌రెడ్డి రాజ‌కీయ అవ‌తారం ఎత్తింది కూడా.. ఈ ఎన్నిక‌ల్లోనే. దీంతో మొత్తానికి విశాఖ కార్పొరేష‌న్‌ను వైసీపీ అయితే.. ద‌క్కించుకుంది. కానీ, ఇప్పుడు ప్ర‌భుత్వం మారిపోవ‌డంతో ఇక్క‌డ కూడా పాల‌న మారిపోయింది.

వైసీపీని వీడి టీడీపీలోకి, జ‌న‌సేన‌లోకి చేరేందుకు వైసీపీ కార్పొరేట‌ర్లు రెడీ అయ్యారు. 12 మంది టీడీపీ లోకి, 9 మంది జనసేనలోకి చేరిపోతున్నారు. దీనికి సోమ‌వారం ముహూర్తం రెడీ చేసుకున్న‌ట్టు పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికే వైసీపీ కార్యాల‌యానికి తాళం వేసి రెండు వారాలు గ‌డిచిపోయింది. తాళం తీసే నాధుడు కానీ..ఇంచార్జ్‌గా ఉన్న వైసీపీసుబ్బారెడ్డి మాట వినే నాయ‌కుడు కాననీ క‌నిపించ‌డం లేదు. అయితే.. విష‌యం తెలిసిన‌…మాజీ గుడ్డు మంత్రి అమ‌ర్‌నాథ్.. ప్ర‌య‌త్నం చేసినా..ఎవ‌రూ ఆయ‌న‌ను ప‌ట్టించుకోలేదు.

తాజాగా మేయర్ స‌హా.. 25 మంది కార్పొరేటర్లు కూడా.. వైసీపీకి రాం రాం చెప్పి.. కూట‌మిలో చేరేందుకు రెడీ అయ్యారు. విశాఖ‌లో కీల‌క టీడీపీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి ఒక‌రు దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని.. చ‌క్రం తిప్పారు. ఫ‌లితంగా విశాఖ‌లో కార్పొరేష‌న్ గెలుపును ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌క‌టించుకున్న వైసీపీ ఇప్పుడు.. అక్క‌డే చ‌తికిల ప‌డ‌నుంది. మొత్తం కార్ప‌రేష‌న్ కూట‌మి ప‌రం కానుంది. దీంతో ఇక‌, వైసీపీ ఆన‌వాళ్లు కూడా క‌నిపించే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.