కేంద్ర బడ్జెట్.. బాబు డిమాండ్లు ఇవే

ఇంకో ఐదు రోజుల్లో కేంద్ర బడ్జెట్ రాబోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మరోసారి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మూడో పర్యాయం మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రవేశ పెడుతున్న తొలి బడ్జెట్ ఇది. ఐతే గతంతో పోలిస్తే బడ్జెట్ భిన్నంగా ఉంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈసారి బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు.

ఏపీలో టీడీపీ, బీహార్‌లో జేడీయూ సాధించిన సీట్లు కీలకంగా మారి, వాటి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంతకుముందులా తాము ఏమనుకుంటే అది చేయడానికి వీల్లేదు.

ఈ రెండు రాష్ట్రాలకు బడ్జెట్లో పెద్ద పీట వేయక తప్పని పరిస్థితి. ఇదే అదనుగా ప్రత్యేక హోదాను డిమాండ్ చేయమని.. ఇంకోటని టీడీపీ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కానీ బాబు ఆచరణ సాధ్యం కాని హోదా లాంటి అంశాల జోలికి వెళ్లట్లేదు.

మోడీ ప్రభుత్వంతో సఖ్యతతో మెలుగుతూ వ్యూహాత్మకంగా రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబట్టుకోవాలని చూస్తున్నారు. బడ్జెట్లో ఏపీకి ఎక్కువ కేటాయింపులు ఉండేలా ఆయన మంత్రాంగం నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వర్గాల బడ్జెట్ ముంగిట బాబు పెట్టిన ప్రపోజల్స్ గురించి సమాచారం బయటికి వచ్చింది.

అమరావతిని మళ్లీ ఏపీ రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు అక్కడ అభివృద్ధిని పరుగులు పెట్టించి ఐదేళ్లలో ఆ ప్రాంత రూపు రేఖలు మార్చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం ఆయన రూ.50 వేట్ల కేటాయింపులు కోరినట్లు సమాచారం. ఇక ఏపీకి జీవనాడి అవుతుందని భావిస్తున్న పోలవరాన్ని తిరిగి పట్టాలెక్కించడం కోసం రూ.12 వేల కోట్లు అడిగారట బాబు.

గత ప్రభుత్వ నిర్వాకం వల్ల అప్పుల భారం పెరిగిపోయిందని.. పరిమితి దాటిన అప్పుల క్లియరెన్స్‌కి రూ.12 వేల కోట్లు కావాలని బాబు అభ్యర్థించారు. అలాగే ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు 10 వేల కోట్లు, ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టులకు రూ.60 వేల కోట్లు అడిగారట బాబు. ఆయన అడిగినవన్నీ ఇచ్చేస్తారని చెప్పలేం కానీ.. బడ్జెట్ పరిమితుల్లో కేటాయింపులు మెరుగ్గా ఉండేలా చూసుకుంటారనడంలో సందేహం లేదు. మరి 23న బడ్జెట్లో ఏపీ కోసం ఏం ప్రకటనలు ఉంటాయో చూడాలి.