మీడియాతో తల గోక్కున్న సాయిరెడ్డి

కొన్ని ఆరోపణలు వచ్చినపుడు, వివాదాలు తలెత్తినపుడు రాజకీయ నాయకులకు మౌనమే సరైన పరిష్కారం. లేదంటే తూతూ మంత్రంగా ఖండించి వదిలేయడం కూడా మంచి ఆప్షనే. అలా కాదని.. సై అంటే సై అంటూ మీడియా ముందుకెళ్లి సవాళ్లు విసిరితే మొదటికే మోసం వస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి పరిస్థితి ఇప్పుడు ఇలాగే తయారైంది.

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషననర్‌గా పని చేసి సస్పెండైన శాంతి అనే ఆఫీసర్‌కు పుట్టిన బిడ్డకు తాను తండ్రిని కాదంటూ ఆమె భర్త అయిన మదన్ మోహన్ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం.. తన తండ్రికి బిడ్డ విజయసాయిరెడ్డి కావచ్చని ఆరోపించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు మీద సోషల్ మీడియాలో ఒక రోజంతా పెద్ద రచ్చ జరిగింది. దీనికి సంబంధించి మీడియాలోనూ కొంత రభస జరిగింది.

ఐతే దీని మీద ప్రెస్ మీట్ పెట్టిన విజయసాయి.. మీడియాలో చర్చోగోష్ఠులు నిర్వహించిన జర్నలిస్టుల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్లందరినీ ‘ఒరేయ్’ అంటూ సంబోధించడమే కాక.. మీ తల్లిదండ్రులకు డీఎన్ఏ టెస్టులు చేయాలి.. మీ పుట్టుక మీద అనుమానాలున్నాయి అని వ్యాఖ్యానించారు.

ఐతే ఈ వ్యాఖ్యలతో ఆయా జర్నలిస్టులు ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చూసుకుందాం అంటూ ఆయా ఛానెళ్లలో సవాళ్లు విసిరి ఇప్పుడు తలెత్తిన గొడవ గురించే కాక మొత్తంగా సాయిరెడ్డి అక్రమాల మీద చర్చలు మొదలుపెట్టారు. దీంతో విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి చేసిన భూ దందాలతో పాటు అన్ని అక్రమాలకు సంబంధించి ఆధారాలు తెప్పించుకుని.. చర్చా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆల్రెడీ శాంతి భర్త మదన్ మోహన్ సాయిరెడ్డికి సంబంధించి అనేక రహస్యాలను బయటపెడతున్నారు. ఆయన్ని కూడా చర్చలకు పిలుస్తున్నారు మీడియా వాళ్లు. శాంతికి సాయిరెడ్డి నాలుగు కోట్ల విల్లా కొనిచ్చిన విషయాన్ని ఆయన బయటపెట్టారు. అంతేకాక విశాఖ ప్రేమ సమాజం భూముల వ్యవహారాన్ని తెర మీదికి తెచ్చారు. ఇలా మీడియా చర్చల్లో సాయిరెడ్డి అక్రమాలు అనేకం బయటికి వస్తున్నాయి.

జనాల అటెన్షన్ అంతా ఇప్పుడు సాయిరెడ్డి మీదే నిలవడంతో కేవలం శాంతి వ్యవహారమే కాక భూదందాలు, ఇతర అక్రమాల గురించి తెలుసుకుని నోరెళ్లబెడుతున్నారు. మొత్తానికి సాయిరెడ్డి అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టి మీడియా వాళ్లను రెచ్చగొట్టి లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.