వ‌ల్ల‌భ‌నేని వంశీ మిస్సింగ్‌.. ఏం జ‌రిగింది?

వ‌ల్ల‌భ‌నేని వంశీ. ఈ పేరుకు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అసెంబ్లీలోను, బ‌య‌టా.. అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నాయకుడు, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును తీవ్ర స్థాయిలో విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసిన వారిలో వంశీ కూడా ఉన్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. 2019లో టీడీపీ త‌ర‌ఫున కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న వంశీ.. త‌ర్వాత కాలంలో వైసీపీ పంచ‌న చేరి ఆ పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి.. చంద్ర‌బాబును తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు.

అయితే.. తాజా ఎన్నిక‌ల్లో వంశీ గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి ఆయ‌న కొన్నాళ్లు విజ‌య‌వాడ‌, మ‌రికొన్నాళ్లు గ‌న్న‌వ‌రంలోనే ఉన్నా.. ఇటీవ‌ల రెండు మూడు రోజులుగా ఆయ‌న మిస్స‌య్యార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. 2021లో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. మంగ‌ళ‌గిరిలో కేంద్ర కార్యాల‌యాన్ని వైసీపీ నాయ‌కులు కొంద‌రు ధ్వంసం చేశారు. అయితే.. ఈ కేసును తాజా కూట‌మి ప్ర‌భుత్వం రీ-ఓపెన్ చేసింది. ఈ క్ర‌మంలో మాజీ మంత్రి జోగి ర‌మేష్ స‌హా.. ఇత‌ర‌నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ చౌద‌రి స‌హా.. ప‌లువురిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

దీంతో వారంతా ఇప్పుడు ముంద‌స్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలావుంటే.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని కూడా నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు పెట్టారు. వంశీని 71వ నిందితుడిగా పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వైసీపీ నాయకుల్లో కొందరిని పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా వంశీ వ్య‌వ‌హారం కూడా తెర‌మీద‌కు వ‌చ్చింది. దీంతో రెండు రోజుల కింద‌టే ఆయ‌న అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన‌ట్టు తెలుస్తోంది. విజ‌య‌వాడ బెంజ్ స‌ర్కిల్ స‌మీపంలోని ఫ్లాట్‌కు, గ‌న్న‌వ‌రంలోని నివాసానికి కూడా తాళాలు వేసి ఉన్న‌ట్టు స‌మాచారం. దీంతో వంశీ ఎక్క‌డికి వెళ్లి ఉంటార‌నే విష‌యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.