కేటీఆర్‌ నటిస్తున్నారా.. భ్రమలో ఉన్నారా?

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని ఆ పార్టీ నేతలే కాదు.. తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నట్లే ఉంది. తాజాగా బీఆర్ఎస్ అగ్ర నేతల్లో ఒకరైన కల్వకుంట్ల తారక రామారావు.. ఏపీలో వైసీపీ ఓటమి పట్ల తెగ ఆశ్చర్యపోయారు. ఐతే ఏపీలో వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు ఎప్పటికప్పుడు సంకేతాలు అందుతూనే ఉన్నా.. ఆ పార్టీ నేతలు దాన్ని గుర్తించలేకపోయారు. కేవలం బటన్లు నొక్కేసి, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే చాలు.. అభివృద్ధి లేకపోయినా, ఎన్ని అరాచకాలు చేసినా చెల్లిపోతుందనే భ్రమలో ఆ పార్టీ నేతలున్నారు. అందుకే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

ఐతే ఓటమి అనంతరం కూడా వాస్తవం గ్రహించలేక జగన్ అండ్ కో తాము పథకాల రూపంలో ఇన్ని డబ్బులు పంచినా ఎలా ఓడిపోయామని ఆశ్చర్యపోతూనే ఉన్నారు. ఇప్పుడు సరిగ్గా కేటీఆర్ సైతం అలాంటి వాదనే చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం.

కేటీఆర్ ఎప్పుడూ తమ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించే మాట్లాడుతుంటారు. ఆయనది, కేసీఆర్‌ది వైసీపీ తరహా సంక్షేమ మంత్రం కాదు. పార్టీ అధికారంలోకి వచ్చే వరకు తెలంగాణ ఉద్యమం కేంద్రంగా వారి పార్టీ రాజకీయాలు నడిచాయి కానీ.. అధికారం చేపట్టాక మాత్రం అభివృద్ధి ప్రధానంగానే ప్రభుత్వాన్ని, రాజకీయాన్ని నడిపించారు. టీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. కేటీఆర్ కొన్ని సందర్భాల్లో జగన్ హయాంలో ఏపీలో అభివృద్ధి లేకపోవడాన్ని ప్రస్తావించారు. అక్కడ రోడ్లు లేవు.. అభివృద్ధి లేదంటూ ఎద్దేవా చేశారు. హరీష్ రావు సహా అనేక మంది టీఆర్ఎస్ నేతలు ఏపీ గురించి ఎద్దేవా చేసిన వారే. అప్పుడు బీఆర్ఎస్ వాళ్లంతా ఏపీ గురించి అలా మాట్లాడిన సంగతి మరిచిపోయి ఇప్పుడు పథకాలిచ్చినా జగన్ ఓడిపోవడం ఏంటి అని కేటీఆర్ ఆశ్చర్యపోవడం విడ్డూరం.

ఈ నేపథ్యంలోనే నెటిజన్లు ఇంతకుముందు ఏపీలో అభివృద్ధి లేకపోవడం మీద కేటీఆర్ కౌంటర్లు వేసిన వీడియోలను తెచ్చి పోస్ట్ చేస్తూ ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. కేటీఆర్ జగన్ ప్రభుత్వ పనితీరు గురించి అన్నీ తెలిసి నటిస్తున్నారా.. లేక వైసీపీ వాళ్ల లాగే ఆయన కూడా ఆ ప్రభుత్వం అద్భుతంగా పాలించిందనే భ్రమలో ఉన్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.