కేసీఆర్‌కు అష్ట‌క‌ష్టాలు… క‌ళ్ల‌ముందే క‌నిపిస్తున్నాయా?

బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మున్ముందు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారాయి. “కెసిఆర్ కు ముందుంది ముసళ్ళ పండగ” అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల అంతరార్థం చాలా తీవ్రంగానే కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీ పరంగా ఆరుగురు ఎమ్మెల్యేలను అదే సంఖ్యలో ఎమ్మెల్సీలను కూడా రేవంత్ రెడ్డి తన వైపు తిప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీలోకి చేర్చేసుకున్నారు. ఇది కేసీఆర్ వంటి బలమైన ఉద్యమ నాయకుడికి, తెలంగాణ సమాజంతో ముడిపడినటువంటి నాయకుడికి తీవ్ర సంకటమైన పరిస్థితి.

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను కెసిఆర్ తేలిగ్గా తీసుకోవచ్చు. “ఆ పోయింది నలుగురే కదా” అని ఆయన లైట్ గా భావించొచ్చు. కానీ రేవంత్ రెడ్డి వ్యూహం మరోలా ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలనేది ఆయన వ్యూహంగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా చెప్పేశారు. “బీఆర్ఎస్ పార్టీ ఉండదు” అని కూడా ఆయన తేల్చేశారు. అంతేకాదు “ప్రజాస్వామ్య విలువల గురించి మాకు నేర్పుతారా. గతంలో మీరు ప్రజాస్వామ్య విలువలను పాటించారా?” అని కూడా ప్రశ్నించారు. “మీరు తీసుకున్నప్పుడు ప్రజాస్వామ్యం. మేము తీసుకుంటే అప్రజాస్వామికమా” అని నిలదీశారు.

ఈ పరిస్థితిని తేలిక‌గా తీసుకునే అవ‌కాశం కనిపించడం లేదు. ఎందుకంటే తెలంగాణ సమాజంలో కేసీఆర్ ప్రభావం తగ్గుతూ వస్తున్న ద‌రిమిలా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా, కేసీఆర్‌ వ్యక్తిగతాన్ని, ఆయన అనుసరించిన విధానాలను ఎండ‌గ‌డుతున్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో కెసిఆర్ పాలన కూడా ప్రజల్లోకి తీసుకు వెళ్ళేటటువంటి బలమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. దీనిని అడ్డుకునే ప్రయత్నం చేసేందుకు కేసీఆర్ ప్రయ‌త్నించినా.. గడిచిన 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ సభ్యులను తాను చేర్చుకోవడం, అదేవిధంగా అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నాయకులను విలీనం చేసుకోవడం ద్వారా చేసినటువంటి కొన్ని తప్పులు కేసీఆర్ స‌రిదిద్దు కోలేనివిగా కనిపిస్తున్నాయి.

ఏ తప్పయితే కేసీఆర్ చేశారో ఇప్పుడు ఆ తప్పే ఆయనను వెంటాడుతుంది. దీనిని అడ్డం పెట్టుకునే రేవంత్ చాలా వ్యూహాత్మకంగా “కెసిఆర్ కు ముందుంది ముసళ్ళ పండుగ” అంటూ వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఓటమి. కొన్నిచోట్ల బీఆర్ఎస్ నేత‌లకు అసలు డిపాజిట్లు రాకపోవడం. కన్న కూతురు కేసుల్లో ఇరుక్కుని జైల్లో ఉండడం. నెలలు గడిచినా ఆమెకు బెయిల్ రాకపోవడం. కేంద్రంలో మోడీ సర్కార్ తో అంట కాగుతున్నారని విమర్శలు మరోవైపు ఉండటం. ఇలా రకరకాలుగా రాజకీయ అస్తిత్వంలో కేసీఆర్ పరిస్థితి ఊగిసలాడుతోంది.

ఇంకోవైపు పార్టీలో గ్రూపులను ప్రోత్సహించిన తనయుడు కేటీఆర్. గ్రూపులకు దూరంగా, పార్టీ అధినేత చెప్పింది శిరసావహించిన హరీష్ రావు. ఇద్దరి మధ్య నడుస్తున్నట్లు కోల్డ్‌వార్‌.. వంటివాటిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో పార్టీలో ఎన్న‌డూ లేని విధంగా చాలామంది ఇప్పటికే బయటికి వచ్చారు. ముందు ముందు కూడా బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి… కేసిఆర్ విషయంలో ఒక స్పష్టమైన వైఖరి అవలంబిస్తున్నారని ముందు ముందు పార్టీ మరింత ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

మరి దీనిని కేసీఆర్ ఎలాంటి వ్యహంతో అడ్డుకుంటారు? ఏ విధంగా పార్టీని నిలబెట్టుకుంటారు? పోతున్న నాయకులను ఆపుతారా? లేక‌ కొత్త నాయకులను తయారు చేస్తారా? ఇట్లాంటివన్నీ కూడా భవిష్యత్తు తేల్చాల్సి ఉంది. ఎలా చూసుకున్నా.. కేసీఆర్‌కు క‌ళ్ల ముందే అష్ట‌క‌ష్టాలు క‌నిపిస్తున్నాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.