అమిత్ షాకు చెప్పడం వెనక అంతర్యమేంటి ?!

‘ఈ నెల 6న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమవుతున్నాం. ఆరో తేదీన మంచి వాతావరణంలో ఇరువురు ముఖ్యమంత్రులం చర్చించుకుంటున్నాం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు చెప్పాను’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ అనంతరం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సంధర్భంగా ‘మీరు సమస్యలు పరిష్కరించుకుంటామంటే మా సహకారం ఉంటుంది’ అని అమిత్ షా తమకు హామీ ఇచ్చారని రేవంత్ తెలిపారు. నీటి పంపకాలు సహా ఎన్నో అంశాలు ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్నాయని, ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించిన తర్వాత మా స్థాయిలో పరిష్కారమవుతాయా? లేదా? తెలుస్తుంది. ఆ తర్వాత ఏ విషయంలోనైనా భిన్నాభిప్రాయాలు ఉంటే కేంద్రం సహకరిస్తుందన్నారు. ఇంకా సమస్య ఉంటే చట్టం ఉందని రేవంత్ అన్నారు.

అయితే చంద్రబాబుతో భేటీ అంశాన్ని అమిత్ షా వద్ద రేవంత్ ప్రస్తావించడం ఏంటన్న చర్చ మొదలయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని తరచూ బీజేపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో రేవంత్ ప్రస్తావన వెనక అంతర్యం ఏంటన్న ప్రశ్న ఉండగా, ఢిల్లీలో ప్రధాని, హోంమంత్రులతో ప్రతి భేటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉండడం కూడా చర్చ మొదలయింది. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ ను నమ్మడం లేదా ? ప్రతి భేటీలో వెంట ఎస్కార్ట్ లా ఎవరో ఒకరిని ఉంచడం ఏంటని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే లోక్ సభ ఎన్నికలు ముగియడం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరడంతో భవిష్యత్తులో తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం పట్ల కేంద్రం ఎలా వ్యవహరిస్తుంది అన్న ఉత్కంఠ మొదలయింది.