వైఎస్ జయంతి .. షర్మిల టార్గెట్ ఏంటి ?

జులై 8. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. సుధీర్ఘ నిరీక్షణ అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రెండో సారి ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలలకే 2009 సెప్టెంబరు 2 హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత కాంగ్రెస్ తో విబేధాల నేపథ్యంలో ఆయన కుమారుడు జగన్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాడు.

ఆ తరువాతి పరిణామాల్లో ఆక్రమాస్తుల కేసుల్లో జగన్ జైలుకు వెల్లడం, షర్మిల పాదయాత్ర, 2014లో ఏపీ, తెలంగాణ విభజన, ఏపీలో జగన్ ఓటమి, 2019 ఎన్నికల్లో జగన్ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కావడం, జగన్ తో సోదరి షర్మిలకు విభేదాలు, తెలంగాణలో షర్మిల పార్టీ, తెలంగాణ ఎన్నికల అనంతరం పార్టీ కాంగ్రెస్ లో విలీనం, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల, కడప ఎంపీగా పోటీ, ఓటమి, జగన్ పార్టీ ఘోర పరాజయం కావడం జరిగింది.

గత ఎన్నికల్లో ఆంధ్రాలో జగన్ పరాజయం వెనక సొంత చెల్లెలు షర్మిల ఆరోపణలు సంచలనంగా నిలిచాయి. ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితం అయిన జగన్, ఆయన తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు.

అయితే ఈ నెల 8న వైఎస్ జయంతి నేపథ్యంలో వైఎస్ షర్మిల విజయవాడలో పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమం తలపెట్టింది. దీనికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొన్నం, దామోదర రాజనర్సింహలను ఆహ్వానించింది. ఇక కర్ణాటకకు వెళ్లి బుధవారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను కలిసి వేడుకలకు ఆహ్వానించింది.

ఈ నేపథ్యంలో అసలు షర్మిల వ్యూహం ఏంటి ? ఎన్నికల్లో ఓటమితో సొంత సోదరుడు నిరుత్సాహంగా ఉన్న పరిస్థితుల్లో షర్మిల ఏ ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తుంది అన్న చర్చ నడుస్తుంది. ఏపీలో చంద్రబాబు ఎలాగూ షర్మిలకు సాయం చేసే పరిస్థితి ఉండదు. ఇప్పట్లో అక్కడ కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు. మరి షర్మిల హడావిడి ఎందుకు అన్న చర్చ నడుస్తుంది. ఇక షర్మిల ఆహ్వానించిన వారిలో ఎంత మంది ప్రముఖులు వస్తారన్నది అంతుచిక్కని ప్రశ్నే.