జీతం ఇస్తామన్నారు.. తీసుకోలేదు-పవన్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక రూ.4 వేలకు పెంచిన పింఛన్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా జులై 1న పంపిణీ చేయడం మొదలుపెట్టింది. ఈ సందర్భంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ తాను ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురం నియోజకవర్గంంలోని గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అక్రమాల గురించి ఆయన మాట్లాడారు. తనకు అధికారులు ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు హాజరైనందుకు జీతం ఇస్తామన్నా.. పంచాయితీరాజ్ శాఖలో జరిగిన నిధుల గోల్‌మాల్ చూసి జీతం తీసుకోబుద్ధి కాలేదని పవన్ చెప్పడం గమనార్హం.

‘‘నేను జీతం తీసుకునే పని చేద్దామని అనుకున్నా. కానీ పంచాయితీరాజ్ శాఖలో చూస్తే ఎక్కడా నిధులు లేవు. మొత్తం ఖాళీ చేసేశారు. వేల కోట్లు ఏమయ్యాయో తెలియదు. ఇటీవల అధికారులు నా దగ్గరికి వచ్చి మీరు అసెంబ్లీకి వచ్చిన రోజులకు 35 వేలో ఎంతో జీతం ఇస్తాం అన్నారు. కానీ పంచాయితీరాజ్ శాఖరలో జరిగింది చూశాక డబ్బులు తీసుకోబుద్ధి కాలేదు.

జీతం తీసుకోకుండా జనం కోసం సొంత డబ్బులు పెట్టుకుని పని చేయాలనుకున్నా. నా 25 ఏళ్ల సినిమా వృత్తిలో దాదాపు వంద కోట్లకు పైగా ట్యాక్స్ కట్టాను. కానీ మా ఆడిటర్‌తో మొత్తం మీద గంటన్నర కంటే ఎక్కువ కూర్చోలేదు. కానీ మొన్న పంచాయితీ రాజ్ శాఖ ఆడిట్ లెక్కల మీద ఒక్కో సెషన్లో నాలుగైదు గంటలు కూర్చున్నాను. ఒక్కో సెషన్లో మూణ్నాలుగు వేల కోట్ల నిధులు మాయం చేసినట్లు తేలింది. ఎక్కడా డబ్బులు మిగలకుండా మాయం చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం’’ అంటూ పవన్ ఆవేదన వ్యక్తం చేశాడు.