అమాత్య ఆశలపై నీళ్లుచల్లిన రేవంత్ !

“కాంగ్రెస్‌ పార్టీలోకి ఇతర పార్టీల నుండి చేరుతున్న నేతలకు మంత్రి పదవులు ఇవ్వం. కాంగ్రెస్‌ బీ ఫాంపై గెలిచిన అభ్యర్థులకు మాత్రమే మంత్రి వర్గ విస్తరణలో అవకాశం లభిస్తుంది. పార్టీ తరపున నిలబడి ఎన్నికల్లో ఓడిన వారికి నామినేటెడ్‌ పదవులు కూడా ఇవ్వం. నామినేటెడ్‌ పదవుల్లో కాంగ్రెస్‌ అనుబంధ సంఘాల నాయకులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం. ఇక పీసీసీ అధ్యక్ష పదవి, మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులను అధిష్టానమే నిర్ణయిస్తుంది” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశాడు. దీంతో ఆశావాహుల గొంతులో పచ్చివెలక్కాయ పడింది.

గత ఎన్నికల్లో ఓడిపోయిన అనేకమంది అభ్యర్థులు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక దాాదాపు 30కి పైగా కార్పోరేషన్ చైర్మన్ పోస్టులను లోక్ సభ ఎన్నికల ముందు ప్రకటించారు. కానీ లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చి 20 రోజులు దాటినా ఆ చైర్మన్ పోస్టులకు సంబంధించి ఎలాంటి జీఓలు విడుదల చేయలేదు. దీంతో ఆ జాబితా వట్టిదేనని తేలిపోయింది.

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, కడియం శ్రీహరిలలో ఇద్దరికి మంత్రి పదవులు ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ రేవంత్ తాజా వ్యాఖ్యలతో వారికి పదవులు లేనట్లేనని తెలిసిపోయింది. ఇది ఇలా ఉంటే ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, గద్వాల నుండి ఓడిపోయిన సరిత, జనగాంలో ఓడిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ లో ఓడిని తూంకుంట నర్సారెడ్డి, జహీారాబాద్ లో ఓడిన చంద్రశేఖర్, సంగారెడ్డిలో ఓడిన జగ్గారెడ్డి, నర్సాపూర్ లో ఓడిన ఆవుల లక్ష్మారెడ్డి తదితరులుపదవులు ఆశిస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యల నేపథ్యంలో వీరెవ్వరికీ అవకాశాలు లేనట్లేనని తేలిపోయింది. కనీసం నామినేటెడ్ పదవులు కూడా రావని తేలిన నేపథ్యంలో వారంతా నిరాశకు గురవుతున్నారు.