ఏం చేస్తాం.. చివ‌రే కూర్చుంటాం: వైసీపీలో నిర్వేదం

ఏపీ అసెంబ్లీలో 11 స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన‌.. వైసీపీ అస‌లు ఎక్క‌డ సీట్లు కేటాయిస్తారో.. ఎక్క‌డ కూర్చోవాల్సి వ‌స్తుందో అనే బెంగ పార్టీని వెంటాడుతోంది. దీంతో ఇప్పుడు జ‌గ‌న్‌.. ప్ర‌త్య‌క్ష యుద్ధానికి తెర‌దీశారు. త‌మ‌కు ప్రతిపక్ష స్థానం క‌ట్ట‌బెట్టాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. రూల్స్-నిబంధ‌న‌ల విష‌యంపై కూడా ఆయ‌న స్పీక‌ర్‌కు లేఖ సంధించారు. గ‌తంలో ఏం చేశారో.. ఇప్పుడు కూడా అలానే చేయాలంటూ.. పాత సంగ‌తులు త‌వ్వేశారు. దీనిపై మున్ముందు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది చూడాలి.

రాష్ట్రంలో ప‌రిస్థితి ఇలా ఉంటే.. లోక్‌స‌భ‌లోనూ వైసీపీ ఆప‌శోపాలు ప‌డుతోంది. ఎందుకంటే.. వైసీపీకి తాజా ఎన్నిక‌ల్లో ద‌క్కింది.. నాలుగంటే నాలుగు ఎంపీ స్థానాలే. పార్ల‌మెంటులో చూసుకుంటే.. 543 మంది. ఇక‌, టీడీపీ ఎలానూ అధికార ప‌క్షంలో ఉంది కాబ‌ట్టి.. ఆ పార్టీకి బెంగ‌లేదు. కానీ, ఎటొచ్చీ.. వైసీపీకి ఉన్న న‌లుగురిని గ‌తంలో గుర్తించిన‌ట్టు ఇప్పుడు ఎవ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. తాజాగా బుధ‌వారం పార్ల‌మెంటులో స్పీక‌ర్ ఎన్నిక జ‌రిగిన‌ప్పుడు త‌మ‌కు ప్రాధాన్యం ఉంటుంద‌ని వైసీపీ పార్ల‌మెంట‌రీ నేత వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలోనే మ‌కాం వేసి.. వేచి చూశారు. కానీ, కేంద్రంలోని మోడీ స‌ర్కారుకు పెద్ద ఇరకాటం ఎదురు కాలేదు.

దీంతో వైసీపీ అవ‌స‌రం లేకుండానే స్పీక‌ర్ ఎన్నిక స‌జావుగా సాగిపోయింది. దీంతో పార్ల‌మెంటులో ఆ పార్టీ ప‌రిస్థితి ఏంట‌నేది రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. స్పీక‌ర్ ఎన్నిక వేళ త‌మ‌కు ప్రాధాన్యం ద‌క్కి ఉంటే.. వేరేగా ఉండేద‌ని.. వైసీపీ ఎంపీలే మీడియాతో అన‌ధికారికంగా వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, సీటింగ్ విష‌యం వైసీపీ ఎంపీల‌ను మ‌రింత ఇబ్బంది పెడుతోంది. స‌భ‌లో అధికార ప‌క్షానికి ముందు వ‌రుస‌లు, త‌ర్వాత వ‌రుస‌ల్లో సీట్లు కేటాయిస్తారు. త‌ర్వాత‌.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి కుడి ప‌క్క‌గా కూర్చుంటుంది. వీరితోనే పార్ల‌మెంటు ప‌రిపూర్ణం.

అటు ఇటు కాకుండా.. ఉన్న కొన్ని పార్టీల‌కు సీట్లు ఎక్క‌డ కేటాయిస్తార‌నేది ప్ర‌శ్న‌. వైసీపీ ఆలోచ‌న కూడా ఇదే. గ‌తంలో 22 మంది ఎంపీలు ఉన్న‌ప్పుడు టీడీపీ కి లోక్‌స‌భ‌లో కేటాయించిన గ‌దిని(పార్ల‌మెంట‌రీ పార్టీకి కేటాయిస్తారు) బ‌ల‌వంతంగా వైసీపీ తీసుకుంద‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కానీ, ఇప్పుడు అదే పార్టీకి స‌భ‌లో కూర్చునేందుకు మ‌ధ్య‌వ‌ర‌సల్లోనూ సీటు లేకుండా పోయింద‌ని తెలుస్తోంది. న‌లుగురు ఎంపీలు మాత్ర‌మే ఉన్న వైసీపీకి ప్రాధాన్యం ద‌క్క‌డం పెద్ద‌గా ఉండ‌ద‌నేది పార్ల‌మెంట‌రీ వ‌ర్గాలు చెబుతున్న మాట‌.

అంటే.. వారి సీట్లు దాదాపు లోక్‌స‌భ‌లో చివ‌రి వ‌రుస‌లో కేటాయించే అవ‌కాశం ఉండొచ్చ‌ని చెబుతున్నారు. గ‌తంలో తొలి నుంచి మూడు, నాలుగు వ‌రుస‌ల్లో కూర్చున్న ఎంపీలు.. ఇప్పుడు 8-9 వ‌రుస‌ల్లో కూర్చోవాల్సి ఉంటుంది. ఎక్క‌డ కూర్చున్నా స‌భ్యుడే అయినా.. ముందువ‌రుస‌లో ఉంటే.. అదో గౌర‌వం అని భావిస్తారు. కానీ, ఇప్పుడు వైసీపీకి ఆ గౌర‌వం ద‌క్కే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో నిర్వేదంలో కూరుకుపోయింది. ఈ విష‌యంపై వైవీ వంటివారు.. స్పందిస్తూ.. “ఎక్క‌డైతే ఏముంది.. ఏదో ఒకలా కూర్చుంటాం” అని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.