మెగా డీఎస్సీకి ఆమోదం.. ఏపీ కేబినెట్ ఏక‌గ్రీవ నిర్ణ‌యం

నిరుద్యోగులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీకి ఏపీ మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. తాజాగా సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల నేతృత్వంలో భేటీ అయిన మంత్రి వ‌ర్గం.. ప‌లు అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చిస్తోంది. అయితే.. తొలి చ‌ర్చ‌గా ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ అయిన‌.. మెగాడీఎస్సీపైనే మంత్రులు చ‌ర్చించారు. చంద్ర‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థుల‌కు అత్యంత కీల‌క‌మైన ఉపాధ్యాయ పోస్టుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల్సి ఉంద‌న్నారు.

దీనికితోడు త‌మ‌పై న‌మ్మ‌కంతో నిరుద్యోగులు కూట‌మిని గెలిపించార‌ని సీఎం చెప్పారు. ఈ నేప‌థ్యంలో వారికి ఇచ్చిన హామీ మేర‌కు తొలి నిర్ణ‌యంగా మెగా డీఎస్సీకి ఆమోదం తెల‌పాల‌ని కోరారు. దీనికి ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా మంత్రులు అంద‌రూ ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపారు. మెగా డీఎస్సీని నియామ‌కాల‌ను ఈ ఏడాది డిసెంబ‌రు నాటికి పూర్తి చేయాల‌ని మంత్రి వ‌ర్గం నిర్ణ‌యించింది. దీనికి సంబంధించిన విధివిధానాలు, నోటిఫికేష‌న్ వంటివాటిని కూడా త్వ‌ర‌గా ఇవ్వాల‌ని పేర్కొంది.

జులై 1 నుంచి డీఎస్సీకి సంబంధించి కార్యాచ‌ర‌ణ ప్రారంభం చేయాల‌ని ప‌క్క‌నే ఉన్న ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్‌ను సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు. కాగా, కొత్తగా టెట్ నిర్వహించాలా..? లేక‌.. టెట్ లేకుండా డీఎస్సీ నిర్వ‌హించాలా అనే విష‌యంపైనా చ‌ర్చించారు. దీనిపై రెండు రోజుల్లో నిర్ణ‌యం తీసుకోవాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని కోరారు. మెగా డీఎస్సీకింద మొత్తం 16,347 పోస్టులను డిసెంబర్ 10లోపు భర్తీ చేయ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు మంత్రులు హ‌ర్షాతిరేకాల మ‌ధ్య ప్ర‌క‌టించారు.

ఇదిలావుంటే.. సోమ‌వారం మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మాన‌వ‌వ‌న‌రుల శాఖ‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ కూడా.. త‌న తొలి సంత‌కాన్ని మెగా డీఎస్సీ ఫైలుపైనే చేయ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలోనే చంద్ర‌బాబు తొలి సంత‌కం చేసిన విష‌యం తెలిసిందే. ఆ సంత‌కం కిందే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ కూడా సంత‌కం చేశారు. దీంతో మెగా డీఎస్సీ నియామ‌కాలు.. ఇక ప‌రుగులు పెట్ట‌నున్నాయ‌ని అంటున్నారు అధికారులు.