పిరికితనంతోనే వైసీపీ సభ్యులు రాలేదు: చంద్రబాబు

ఏపీ 16వ శాసన సభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు స్పీకర్ గా అయ్యన్న బాధ్యతలు చేపట్టిన తర్వాత సభాధ్యక్షుడి హోదాలో సీఎం చంద్రబాబు తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మునుపెన్నడూ లేని విధంగా భావోద్వేగానికి గురై ప్రసంగించారు. గతంలో తాను కౌరవ సభ నుంచి వాకౌట్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకొని చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. ఆనాడు తన సతీమణిని దూషించారని, కుటుంబ సభ్యులను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాట్లాడి వాకౌట్ చేస్తానంటే మైక్ ఇవ్వలేదని, అందుకే ముఖ్యమంత్రిగానే గౌరవ సభకు వస్తానని వాకౌట్ చేశానని ఆనాడు తాను అన్న వ్యాఖ్యలను సభలో మళ్లీ చదివి వినిపించి ఎమోషనల్ అయ్యారు.

రాజకీయాలకు సంబంధం లేకపోయినా తన కుటుంబ సభ్యులను దూషించారని, తన సతీమణి పై అసభ్యకరమైన కామెంట్లు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజామోదంతోనే మళ్లీ సీఎంగా సభలోకి వచ్చానని, మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు గడ్డపై తెలుగువాడిగానే పుట్టి తెలుగు జాతి రుణం తీర్చుకుంటానని చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు.

గత సభలో తమకు 23 సీట్లు వచ్చాయని, ఇది దేవుడి స్క్రిప్ట్ అని మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు ఎద్దేవా చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఈ సారి కూటమి గెలిచిన సీట్లు164 అని, అన్నీ కలిపితే 11 వస్తుందని, 11 సీట్లు వైసీపీకి రావడం దేవుడి స్క్రిప్ట్ అని తాను అనబోనని చంద్రబాబు వైసీపీ నేతలకు చురకలంటించారు.1631 రోజుల పాటు అమరావతి రైతులు ఉద్యమం చేశారని, ఆ అంకెలు కలిపినా 11 వస్తుందని, ఇది దేవుడి స్క్రిప్ట్ అని నేను అనను అని చంద్రబాబు చెప్పారు.

ఈ రోజు సభలో ఉండకపోవడం వైసీపీ నేతల పిరికి తనం తప్ప ఇంకోటి కాదని సభకు హాజరు కాని వైసీపీ సభ్యులనుద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయినా, గత సభలో వైసీపీ సభ్యుల మాదిరి ప్రవర్తించకూడదని, ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టాలని, వైసీపీ నేతలపై కాదని చంద్రబాబు మిగతా సభ్యులకు హితవు పలికారు. పవన్ కల్యాణ్ ను అసెంబ్లీ గేటు తాకనివ్వను అని పెద్ద డైలాగులు కొట్టిన వారు ఈ రోజు సభలో లేరని, ఆయన 21 కి 21 సీట్లు గెలిచి డిప్యూటీ సీఎంగా సభలో అడుగుపెట్టారని అన్నారు. వై నాట్ 175 అని 11 కూడా తెచ్చుకోని నాయకత్వం వైసీపీది అని ఎద్దేవా చేశారు. ఎక్కడ తగ్గాలో..ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని, ఇదే విషయం తాను చాలాసార్లు చెప్పానని అన్నారు.