స‌భ‌కు న‌మ‌స్కారం.. తేల్చేసిన జ‌గ‌న్‌!

అసెంబ్లీకి వెళ్లాలా? వ‌ద్దా? అనే అంశంపై వైసీపీ అధినేత జ‌గ‌న్ తేల్చేశారు. ఇక‌, వెళ్ల‌కూడ‌ద‌ని నిర్ణ‌యించేసుకున్నారు. శుక్ర‌వారం స‌భకు హాజ‌రైన ఆయ‌న‌.. ప్ర‌మాణం చేశారు. అనంత‌రం.. త‌న‌కు కేటాయించిన చాంబ‌ర్‌కు వెళ్లిపోయి.. త‌న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో భేటీ అయ్యారు. వారితోనూ ఈ విష‌యంపై చ‌ర్చించారు. వెళ్దామా? వ‌ద్దా? అని ప్ర‌శ్నించారు. దీనికి వారు త‌మ నిర్ణ‌యాన్ని జ‌గ‌న్‌కే వ‌దిలేశారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఎవ‌రికీ చెప్ప‌కుండానే త‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించేశారు.

శ‌నివారం ఆయ‌న పులివెందుల ప‌ర్య‌ట‌న పెట్టుకున్నారు. ఉద‌యం 10 గంట‌ల‌కు జ‌గ‌న్‌ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందులకు వెళ్తారు. అక్క‌డే మూడు రోజుల పాటు ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతారు. ఇదే స‌మ‌యంలో జిల్లాలో ఎన్నిక‌లు జ‌రిగిన తీరు.. ఫ‌లితంపై ఆయ‌న జిల్లా ప్ర‌జాప్ర‌తినిధులు.. త‌న వారితో భేటీ అవుతారు. అదేస‌మ‌యంలో వైసీపీ లోపాల‌ను కూడా గుర్తించి..స‌రిచేయనున్నారు. సో.. దీనిని బ‌ట్టి.. జ‌గ‌న్ అసెంబ్లీకి వ‌చ్చే ఉద్దేశం కానీ.. అవ‌కాశం కానీ లేవు.

వాస్త‌వానికి శ‌నివారం అసెంబ్లీలో స్పీక‌ర్‌ను ఎన్నుకునే ప్ర‌క్రియ ఉంది. అయితే.. ఇది ఏక‌గ్రీవం కావ‌డంతో న‌ర్సీప‌ట్నం ఎమ్మెల్యే చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు స్పీక‌ర్‌గా కూర్చోనున్నారు. సంప్ర‌దాయం ప్ర‌కారం.. అధికార ప‌క్షం నాయ‌కుల‌తోపాటు.. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న వారు కూడా.. స్పీక‌ర్‌ను ఆ స్థానం వ‌ర‌కు తీసుకువెళ్లి సాగ‌నంపుతారు. ఇప్పుడు ఈ కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ హాజ‌రుకావ‌డం లేదు. అయితే.. స‌భ‌కు వెళ్ల‌కూడ‌ద‌ని ఆయ‌న ఒక్క‌రే నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో.. తాడేప‌ల్లి వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం మేర‌కు ఈ కార్య‌క్ర‌మానికి సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని పంపుతున్న‌ట్టు తెలిసింది. ఆయ‌న వ‌చ్చి స్పీక‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న అయ్య‌న్న పాత్రుడిని సీటు వ‌ర‌కు సాగ‌నంపుతారు. రాజ‌కీయంగా ఇది వివాదం అయ్యే అవ‌కాశం ఉన్నా.. ప్ర‌తిప‌క్ష హోదా త‌మ‌కు ఎలానూ లేద‌న్న నేప‌థ్యంలో వైసీపీ అధినేత ఈ కార్య‌క్ర‌మాన్ని లైట్ తీసుకున్నారు. ఇక‌, అయ్య‌న్న‌పాత్రుడు చేసిన వ్యాఖ్య‌లు కూడా.. జ‌గ‌న్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో స‌భ‌కు ఆయ‌న దూరం కానున్నారు.

ప్ర‌మాణం ఎందుకు చేసిన‌ట్టు?

స‌భకు వెళ్లి.. ప్ర‌మాణం చేసే విష‌యంలో జ‌గ‌న్ ఎందుకు నిర్ణ‌యం తీసుకున్నార‌నేది కూడా ఆస‌క్తికర విష‌యం. ఇలా క‌నుక ప్ర‌మాణం చేయ‌క‌పోతే.. ఆయ‌న‌ను ప్ర‌జ‌లు ఎన్నుకున్నా.. రికార్డుల ప్ర‌కారం.. రాజ్యాంగం ప్ర‌కారం.. ఆయ‌న ఎన్నిక చెల్ల‌దు. దీంతో 6 మాసాల్లో ఉప ఎన్నిక వ‌చ్చి.. ఆయ‌న ఎన్నిక ర‌ద్ద‌వుతుంది. దీనికితోడు.. ప్ర‌మాణం చేయ‌క‌పోతే.. ఎమ్మెల్యేగా ఆయ‌న‌కు గుర్తింపు ఉండ‌దు. ఈ రెండు కార‌ణాల‌తో జ‌గ‌న్ మ‌న‌సులో ఏమ‌నుకున్నా.. గౌర‌వంగా స‌భ‌కు వెళ్లి ప్ర‌మాణం చేసి వ‌చ్చారు.