సంప‌ద సృష్టిపై చంద్ర‌బాబు దిశానిర్దేశం.. ఏం చెప్పారంటే

తాము అధికారంలోకి వ‌స్తే.. రాష్ట్రంలో సంప‌ద‌ను సృష్టిస్తామ‌ని టీడీపీ అధినేత‌, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పిన విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన ప‌క్షం రోజుల్లోనే ప‌ని ప్రారంభించారు. రాష్ట్రానికి పెట్టుబ‌డులు తీసుకురావాల‌ని.. కూట‌మి పార్టీలైన జ‌న‌సేన‌, బీజేపీ ఎంపీల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఏమాత్రం బాగోలేద‌ని.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల్సి ఉంద‌ని తెలిపారు.

దీనికి పెట్టుబ‌డులు వ‌స్తేనే సాధ్య‌మ‌వుతుంద‌ని చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా చంద్ర‌బాబు కూట‌మి పార్టీల త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న ఎంపీలు, కేంద్ర మంత్రుల‌కు త‌న నివాసంలో విందు ఇచ్చారు. దీనికి బీజేపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న ఎంపీలు ముగ్గ‌రు, జ‌న‌సేన త‌ర‌ఫున విజ‌యం సాధించిన ఇద్ద‌రు, టీడీపీ త‌ర‌ఫున గెలిచిన ఎంపీలు హాజర‌య్యారు. వీరిని ఉద్దేశించి చంద్ర‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెట్టుబ‌డులు అవ‌స‌రం ఎంతో ఉంద‌న్నారు.

ప్ర‌స్తుతం అమ‌రావ‌తి రాజ‌ధానిని ప‌ట్టాలెక్కించే ప‌నిని ప్రారంభించామ‌ని.. ఈ నేప‌థ్యంలో పెట్ట‌బడుల‌కు అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. మీ మీ స్థాయిలో పెట్టుబ‌డులు ఆక‌ర్షించేందుకు అవ‌స‌రం ఉన్న అన్ని మార్గాల‌ను వినియోగించుకోవాల‌న్నారు. రాష్ట్రానికి సేవ చేసేందుకు ప్ర‌జ‌లు మ‌నల్ని ఎన్నుకున్నార‌న్న విష‌యాన్ని గ‌మ‌నంలో పెట్టుకుని ఆదిశ‌గా అడుగులు వేయాల‌ని సూచించారు. అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాల‌ని కోరారు.

ఇగోల‌కు పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఏ పార్టీల త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నా.. అంతిమంగా రాష్ట్ర‌మేలు కోసం అంద‌రూ క‌ల‌సి ప‌నిచేయాల‌న్నారు. ఏ స్థాయి పెట్టుబ‌డులు వ‌చ్చినా.. వ‌దులు కోవ‌ద్ద‌ని అంద‌రినీ ఆహ్వానించాల‌ని సూచించారు. త్వ‌ర‌లోనే పెట్టుబ‌డుల‌కు సంబంధించిన విధానాన్ని ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. ఈ విందుకు.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు పురందేశ్వ‌రి, కేంద్ర మంత్రులు రామ్మోహ‌న్‌నాయుడు త‌దిత‌రులు పాల్గొన్నారు.