కోడెల ఆత్మ వైసీపీని వెంటాడుతోందా?!

దివంగత స్పీక‌ర్‌, మాజీ మంత్రి కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఆత్మ వైసీపీని వెంటాడుతోందా? ఆయ‌న‌ను అన్యాయంగా మాన‌సిక క్షోభ‌కు గురి చేసి.. ఆత్మ‌హ‌త్య చేసుకునేలా వైసీపీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రించారా? ఇప్పుడు ఆ ఘ‌ట‌న మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా మాజీ స్పీకర్ కోడెలను ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా మానసిక క్షోభకు గురి చేసిన అప్పటి ముఖ్యమంత్రి జ‌గ‌న్‌, సలహాదారు సజ్జల రామ‌కృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి, సాక్షి మీడియా, సాక్షి పత్రికలపై చట్టప్రకారం కఠి‌న చర్యలు తీసుకోవాల‌ని కోరుతూ.. తెలుగు మహిళ అధికార ప్రతినిధి తేజశ్విని అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు.

దీనిపై ఇంకా కేసు న‌మోదు కాలేదు. కానీ, తీగ అయితే క‌దిలింది. త‌ర్వాత ప‌రిణామాలు ఎలా మారుతాయ‌నేది చూడాలి. కానీ, ఇప్పుడు అనూహ్యంగా అస‌లు కోడెల ఎలా ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. దీనికి వైసీపీకి సంబంధం ఏంట‌నేది రాజ‌కీయంగా మ‌రో సారి లోతైన చ‌ర్చ‌సాగుతోంది. ప్ర‌స్తుత తాజా మాజీ సీఎం జ‌గ‌న్‌.. త‌న క్యాంపు కార్యాల‌యంలో కోనుగోలు చేసుకున్న ఫ‌ర్నిచ‌ర్ ను అధికారం కోల్పోయినా.. స‌ర్కారుకు తిరిగి ఇవ్వ‌లేదు. పైగా రుసుము కూడా చెల్లించ‌లేద‌నే వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో కోడెల కుమారుడు, టీడీపీ నాయ‌కుడు శివ‌రామ‌కృష్ణ ఈ విష‌యంలో రెండు రోజుల కింద‌ట స్పందించారు.

త‌న తండ్రిపై అప్ప‌ట్లో దొంగ‌త‌నం కేసు న‌మోదుచేసిన‌ట్టుగానే ఇప్పుడు మాజీ సీఎం జ‌గ‌న్‌పైనా కేసులు పెట్టాల‌న్న‌ది ఆయ‌న డిమాండ్‌. అయితే.. ఇంత‌లోనే వైసీపీ స్పందించి.. స‌ద‌రు ఫ‌ర్నిచ‌ర్‌కు రేటు క‌ట్టండి ఇచ్చేస్తామ‌ని చెప్పింది. ఇలా.. ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా కొన‌సాగుతోంది. ఇంత‌లోనే తెలుగు మ‌హిళ నాయ‌కురాలు ఏకంగా ఎస్పీకి ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిపై ఎస్పీ ఏం చేస్తార‌నేది చూడాలి. స‌ర్కారు కూడా.. ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌నేది ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టికైతే.. ఈ వివాదం మాత్రం జ‌గ‌న్ చుట్టూ తిరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

అప్ప‌ట్లో ఏం జ‌రిగింది అంటే ?

2014లో ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌బుత్వం ఏర్ప‌డిన‌ప్పుడు 2015 వ‌ర‌కు అసెంబ్లీ స‌మావేశాలు హైద‌రాబాద్‌లోనే జ‌రిగాయి. అప్ప‌ట్లో స్పీక‌ర్‌గా కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఉన్నారు. త‌ర్వాత‌.. అనివార్య కార‌ణాల‌తో చంద్ర‌బాబు రాత్రికి రాత్రి ఏపీకి త‌ర‌లి వ‌చ్చారు. ఈ స‌మయంలో అక్క‌డ ఏపీకి ఉన్న ఫ‌ర్నిచ‌ర్‌ను కూడా.. విజ‌య‌వాడ‌, గుంటూరు ప్రాంతాల‌కు త‌ర‌లించారు.

ఈ స‌మ‌యంలో కొంత ఫ‌ర్నిచ‌ర్‌ను విజ‌య‌వాడ‌లో ఉంచేందుకు వీలు లేక‌పోవ‌డంతో(కోడెల చెప్పిన‌ట్టుగా) గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లిలోని కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఫాం హౌస్ లో ఉంచారు. త‌ర్వాత‌.. వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం దీనిని కార్న‌ర్ చేస్తూ.. కోడెల‌పై దొంగ అనే ముద్ర వేసిన విష‌యం తెలిసిందే. అనంత‌రం.. కోడెల‌.. హైద‌రాబాద్‌లో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. దీనికి వైసీపీనే కార‌ణ‌మ‌ని అప్ప‌ట్లో టీడీపీ నాయ‌కులు ఆరోపించారు. ఇప్పుడు అదే మ‌రోసారి వెలుగు చూసింది.