మ‌న‌సు మార్చుకున్న జ‌గ‌న్.. అసెంబ్లీకి అడుగులు!

వైసీపీ అధినేత‌, తాజా మాజీ సీఎం జ‌గ‌న్‌.. త‌న మ‌న‌సు మార్చుకున్నారు. అసెంబ్లీకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వాస్త‌వానికి ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నికల్లో త‌మ‌దే విజ‌య‌మ‌ని జ‌గ‌న్ భావించారు. అందుకే.. చాలా హుషారుగా ఆయ‌న ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. లండ‌న్ స‌హా విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. కానీ, ఆయ‌న ఆశించిన‌ట్టు ఫ‌లితం రాలేదు. పూర్తిస్థాయి మెజారిటీ ద‌క్క‌క పోయినా.. క‌నీస మెజారిటీతో అయినా.. ఒడ్డున ప‌డతామ‌ని భావించిన వైసీపీ నాయ‌కులు జ‌నాలు షాకిచ్చారు. ప్ర‌తి ప‌క్ష హోదా కూడా ద‌క్క‌ని రీతిలో 11 స్థానాలకు ప‌రిమితం. ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్షం హోదా ద‌క్కాలంటే 15 శాతం సీట్లు ఉండాలి.

అంటే వైసీపీకి క‌నీసం 18 స్థానాలు ద‌క్కి ఉండాలి. కానీ, ప్ర‌జ‌లు మాత్రం వైసీపీని 11 స్థానాల‌కే ప‌రిమితం చేశారు. దీంతో 151 స్థానాల‌తో గంభీరంగా అసెంబ్లీలో అడుగు పెట్టిన జ‌గ‌న్‌.. ఇప్పుడు 11 మందితో అసెంబ్లీకి వెళ్లాలంటే.. తీవ్ర అవ‌మానంగా వైసీపీ నాయ‌కులు భావించారు. దాదాపు జ‌గ‌న్ కూడా ఇదే విష‌యంపై అంత‌ర్మ‌థ‌నం చెందారు. ఇక‌, అసెంబ్లీకి వెళ్లరాద‌ని.. త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని కూడా ఆయ‌న నిర్ణ‌యించుకున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెప్పాయి. కానీ, త‌ర్వాత‌.. మేదావులు. స‌ల‌హాదారుల‌ను సంప్ర‌దించ‌గా.. ఇలా చేస్తే.. వైసీపీపై అధికార ప‌క్షం మరింత దాడి చేస్తుంద‌న్న సూచ‌న‌లు వ‌చ్చాయి.

దీంతో తాజాగా జ‌గ‌న్ మ‌న‌సు మార్చుకున్నారు. త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న‌ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ నేపథ్యంలో త‌న షెడ్యూల్లోనూ మార్పులు చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా పార్టీ నేత‌ల‌తో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వ‌హించాల‌ని అనుకున్న ఆయ‌న దీనిని ఈనెల 22కు బదులుగా ఈనెల 20నే నిర్వహించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు పార్టీ తెలిపింది. ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీచేసిన అభ్యర్థులు ఆ రోజు త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రు కావాల‌ని పేర్కొంది.

అలాగే పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్యర్థులు(ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. ఇక‌, బుధ‌వా రం పులివెందుల పర్యటనకు వెళ్లాల్సిన మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి దీనిని కూడా వాయిదా వేసుకున్నారు. దీనిని బ‌ట్టి.. జ‌గ‌న్ అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యేందుకు మాన‌సికంగా సిద్ధ‌మ‌య్యార‌నే చ‌ర్చ సాగుతోంది.