అధ్యక్ష్య పదవి రేసులోకి అరుంధతి !

తెలంగాణలో ఎనిమిది ఎంపీ, ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుని బీజేపీ పార్టీ మాంచి ఊపు మీద ఉంది. మొన్న ఎనిమిది, నిన్న ఎనిమిది, రేపు 88 అంటూ బీజేపీ నేతలు స్టేట్ మెంట్లు మొదలుపెట్టారు. తెలంగాణ నుండి గెలిచిన 8 మంది ఎంపీలలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు కేంద్రంలో మంత్రి పదవులు దక్కాయి. మంత్రి పదవులు ఖాయం అనుకుని ఆశపడ్డ ఈటెల రాజేందర్, డీకె అరుణలు భంగపడ్డారు. ఈ నేపథ్యంలో ఇక ఈటెల రాజేందర్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం పక్కా అని ఆయన అనుచరులు, అభిమానులు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అనూహ్యంగా అనేక మంది ఈ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తుండగా, బీజేపీ అధిష్టానం కూడా దీనిని అంత తేలిగ్గా తీసుకోవడం లేదు.

సీనియర్ నాయకుడు అయిన ఈటెలకు పదవి ఇస్తే స్థానిక ఎన్నికల్లో రానించవచ్చని బీజేపీలోని ఒక వర్గం వాదిస్తున్నది. అయితే రేవంత్ సొంత జిల్లాలో ఎంపీగా గెలిచి సత్తాచాటిన డీకె అరుణకు పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా మొదలయింది. రేవంత్ మార్క్ రాజకీయాన్ని తట్టుకోవాలి అంటే డీకె అరుణకు పగ్గాలు ఇవ్వాలని మరో వాదన మొదలయింది. అధిష్టానం పరిశీలనలో కూడా ఈ అంశం ఉందని తెలుస్తుంది.

ఇక కేసీఆర్ సొంత జిల్లా మెదక్ లో ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు కూడా తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. మంచి వాగ్దాటి ఉన్న రఘునందన్ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతుండగా, వరసగా రెండో సారి నిజామాబాద్ నుండి గెలిచిన ధర్మపురి అరవింద్ తనకు మంత్రిపదవి రానందున రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఇవ్వాలని కోరుతున్నాడు. ఇక ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించిన తనకు అవకాశం ఇవ్వాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి అడుగుతున్నాడని సమాచారం.

ఇక మల్కాజ్ గిరి సీటు దక్కని మురళీధర్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, పేరాల చంద్రశేఖర్ లతో పాటు, ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన మాజీ బీసీ కమీషన్ సభ్యుడు ఆచారి కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. మరి బీజేపీ అధ్యక్ష్య పదవి ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.