వైసీపీకి ‘క‌ర్మ ఫ‌లం’: సీమెన్స్ మాజీ ఎండీ

ఏపీలో వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 90 వేలు, 80 వేలు , 70 వేల ఓట్ల తేడాతో వైసీపీ నాయ‌కులు మ‌ట్టిక‌రిచారు. ప్ర‌భుత్వం కూలిపోయింది. అయితే.. ఇది రాజ‌కీయంగా ఇప్ప‌టి వ‌ర‌కు అధికార‌ప‌క్ష నాయకులు చేసిన విమ‌ర్శ‌లు. కానీ, ఇప్పుడు కార్పొరేట్ దిగ్గ‌జం.. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్‌.. త‌న‌దైన శైలిలో వైసీపీని ఎండ‌గ‌ట్టారు. ‘క‌ర్మ ఫ‌లం’ అనుభ‌విస్తున్నారు అంటూ.. ఆయ‌న వ్యాఖ్యానించారు.

తాజాగా ఆయ‌న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టు చేశారు. ‘ఏపీలో న్యాయం గెలుస్తుందని నేను చెప్పిన మాటలను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నిజం చేశారు’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇదీ.. వైసీపీ క‌ర్మ‌ఫ‌లం.. చేసినందుకు అనుభ‌విస్తోంద‌ని వ్యాఖ్యానించారు. సార్వ‌త్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లకు సుమన్ బోస్ శుభాకాంక్ష‌లు చెప్పారు. రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్లాల‌ని తాను మ‌న‌సారా కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. అయితే.. ఆయ‌న వైసీపీపై ఇలా ‘క‌ర్మ‌ఫ‌లం'(చెడు చేసినందుకు అనుభ‌వించడం అనే అర్ధం) అని కామెంట్లు చేయ‌డం ఆస‌క్తిగా మారింది.

ఏంటి కార‌ణం?

గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ ను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసింది. దీనికి సీమెన్స్ కంపెనీని అప్ప‌ట్లో చంద్ర‌బాబు స‌ర్కారు వినియోగించుకుంది. అప్ప‌ట్లో ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఈ కంపెనీతో క‌లిసి ప‌నులు చేయించారు. అయితే.. వైసీపీ స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ లో అవినీతి జ‌రిగింద‌ని.. సీమెన్స్ కంపెనీకి రూ.300 కోట్ల‌ను ముందుగానే చెల్లించార‌ని.. అటు నుంచి తిరిగి మ‌ళ్లీ టీడీపీ ఖాతాలోకే ఈ సొమ్ములు వ‌చ్చాయ‌ని పేర్కొంటూ.. చంద్ర‌బాబుపై కేసులు పెట్టి జైలుకు పంపించిన విష‌యం తెలిసిందే.

దీంతో ఈ విష‌యంపై అప్ప‌ట్లోనే సీమెన్స్ మాజీ ఎండీగా ఉన్న సుమ‌న్ బోస్‌.. హైద‌రాబాద్‌లో పెద్ద మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి.. తాము తీసుకున్న సొమ్ము రూ.300ల‌కు ర‌సీదులు ఉన్నాయ‌ని.. అధికారికంగానే త‌మ‌కు సొమ్ములు అందాయ‌ని.. చంద్ర‌బాబు అవినీతి చేయ‌లేద‌ని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం కారణంగా జీవితంలో తాను సంపాదించుకున్న పేరు ప్రతిష్టలకు తీవ్ర విఘాతం కలిగింద న్నారు. అంతేకాదు దీని ద్వారా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు.

సంబంధిత‌ ప‌త్రాల‌ను కూడా.. చూపించే ప్ర‌య‌త్నం చేశారు. రూ.70 కోట్ల వ‌ర‌కు ప‌త్రాలు చూపించారు. అయితే.. దీనిని అప్ప‌ట్లో వైసీపీ త‌ప్పుబ‌ట్టి.. సుమన్‌బోసు కూడా అవినీతి ప‌రుడే అంటూ.. అప్ప‌టి మంత్రులు వ్యాఖ్యానించారు. దీంతో అప్ప‌ట్లోసైలెంట్ అయిన‌.. బోస్‌.. తాజాగా రియాక్ట్ అయ్యారు. త‌మ‌ను అన‌వ‌స‌రంగా నిందించి.. అభాసు పాలు చేసిన వైసీపీ క‌ర్మ‌ఫ‌లం అనుభ‌విస్తోంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.