బాబుకు స‌వాలుగా మారిన పొన్నూరు రాజ‌కీయం.. రీజ‌నేంటంటే!

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండ‌వ‌నే విష‌యం తెలిసిందే. ఎప్పుడు ఎలా మార‌తాయో.. ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌వుతాయో చెప్ప‌డ‌మూ క‌ష్ట‌మే. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితి టీడీపీకి చెందిన కీల‌క‌మైన నాయ‌కుడి వ‌ద్ద క‌నిపిస్తోంద‌ని అంటున్నారు పార్టీ నాయ‌కులు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గం.. టీడీపీకి కంచుకోట‌. ధూళిపాళ్ల వీర‌య్య చౌద‌రి నుంచి నేటి న‌రేంద్ర కుమార్ వ‌ర‌కు టీడీపీకి వెన్నుద‌న్నుగా నిలిచారు. వ‌రుస విజ‌యాల‌తో ఇక్క‌డ మ‌రోపార్టీ ఊసు, ధ్యాస కూడా లేకుండా చేశారు. ఈ క్ర‌మంలోనే న‌రేంద్ర కుమార్‌.. ఐదు ప‌ర్యాయాలు వ‌రుస విజ‌యాలు సాధించి.. టీడీపీని నిల‌బెట్టారు.

అయితే, అన్ని ప‌రిస్థితులూ.. అన్నిరోజులు ఒకేలా ఉండ‌వ‌న్న‌ట్టుగా.. ఇప్పుడు న‌రేంద్ర కుమార్‌లోనూ రాజ‌కీయంగా పెనుమార్పులు చోటు చేసుకున్నాయ‌ని అంటున్నారు టీడీపీసీనియ‌ర్లు. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ ధాటికి అప్ప‌టి వ‌ర‌కు తిరుగులేని విజ‌యాన్ని ఆస్వాదిస్తున్న న‌రేంద్ర ఓట‌మిపాల‌య్యారు. స‌రే.. ఓట‌మి స‌హ‌జం అనుకున్నా.. ఆయ‌న అప్ప‌టి నుంచి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాజ‌ధాని ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి కూడా ఉంది. అయినా కూడా పెద్ద‌గా రాజ‌ధాని ఉద్య‌మంలో ఆయ‌న పాలుపంచుకోలేదు. ఆయ‌న సంస్థ త‌ర‌ఫున ఓ నాలుగు టిన్నులు పెరుగు ప్యాకెట్లు, బిస్కెట్లు పంచారు త‌ప్ప‌.. యాక్టివ్ పొలిటీషియ‌న్‌గా మాత్రం ఉండ‌లేక పోయారు.

ఇక‌, పార్టీ అధినేత చంద్ర‌బాబు.. ఈ ఏడాదిన్న‌ర‌లో .. జ‌గ‌న్ స‌ర్కారుపై అనేక రూపాల్లో యుద్ధం ప్ర‌క‌టించినా.. న‌రేంద్ర ఒక్క‌టంటే ఒక్క కార్య‌క్ర‌మానికీ హాజ‌రుకాలేద‌ని సీనియ‌ర్ త‌మ్ముళ్ల విమ‌ర్శ ఉండ‌నే ఉంది. కేవ‌లం జగ‌న్ స‌ర్కారు.. త‌న కుటుంబంపై చేసిన భూముల కొనుగోలు ఆరోప‌ణ‌ల‌పై మాత్ర‌మే స్పందించిన న‌రేంద్ర‌.. త‌ర్వాత మ‌ళ్లీ మౌనం పాటించారు. మ‌రి ఎందుకిలా చేస్తున్నారు? ఆయ‌నేమ‌న్నా టీడీపీకి దూరంగా ఉన్నారా? వైసీపీకి చేరువ‌య్యారా? అంటే.. అలాంటిదేం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితుల‌కు త‌గిన విధంగా మారాల‌నే సూత్రాన్ని పాటిస్తున్నార‌ట‌.

న‌రేంద్ర కుమార్ కుటుంబం నిర్వ‌హిస్తున్న డెయిరీ వ్యాపారానికి , ఇత‌ర వ్యాపారాల‌కు చిక్కులు రాకుండా స‌ర్దుబాటు ధోర‌ణిని అవ‌లంబిస్తున్నార‌ని టీడీపీ నేత‌లే చెబుతున్నారు. ఈ క్ర‌మంలో పొన్నూరు నుంచి గెలిచిన వైసీపీ నాయ‌కుడు రోశ‌య్య‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. త‌న వ్యాపారాల‌కు ఎస‌రు రాకుండా చూసుకోవ‌డం, ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా చూసుకునే విధానంలో భాగంగా న‌రేంద్ర నాణ్యంగా స‌ర్దుకు పోతున్నార‌ని త‌మ్ముళ్లు చెబుతున్నారు.

మ‌రి.. ఈ విష‌యం చంద్ర‌బాబుకు తెలియ‌దా? అంటే.. తెలుసు! కానీ ఏం చేస్తారు. సీనియ‌ర్ నాయ‌కుడు. వ్యాపారం దెబ్బ‌తింటే.. మొత్తానికే మోసం.. అనుకుని స‌రిపెట్టుకుంటున్నార‌ట‌. కాదు.. కూడ‌దంటే.. న‌రేంద్ర జంప్ చేసే అవ‌కాశం ఉంది. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాల‌పై మౌన‌మే మంచిద‌ని బాబు భావిస్తున్నార‌ట‌. ఇదీ సంగ‌తి!!