చంద్ర‌బాబుకు మోడీ ఇంపార్టెన్స్ వెనుక‌.. రీజ‌నేంటి?

కేంద్రంలో కొలువు దీరిన ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వంలో టీడీపీ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఒంట‌రిగానే 16 మంది ఎంపీల‌ను ద‌క్కించుకున్న టీడీపీ కేంద్రంలో చ‌క్రం తిప్పుతోంది. ముఖ్యంగా బీజేపీకి 240 సీట్లు మాత్ర‌మే రావ‌డంతో చంద్ర‌బాబుకు అనూహ్య‌మైన గౌర‌వం, మ‌ద్ద‌తు కూడా ల‌భిస్తోంది. ఇక‌, బిహార్ అధికార పార్టీ నితీష్ కుమార్ స‌ర్కారు నుంచి 12 మంది ఎంపీలు ఉన్నారు. ఇటు చంద్ర‌బాబు, అటు నితీష్ ఇద్ద‌రూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిల‌బెట్టార‌నేది వాస్త‌వం.

అయితే.. చంద్ర‌బాబు, నితీష్‌ల‌లో మోడీకి అత్యంత న‌మ్మ‌క‌స్తుడు మాత్రం చంద్ర‌బాబు మాత్ర‌మే. నితీష్ అవ‌కాశవాది అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. గ‌తంలోనూ బీజేపీతో క‌లిసి ఉండి.. త‌ర్వాత వ‌దిలేశారు. మ‌ళ్లీ క‌లిశారు. ఇలా.. గ‌డిచిన నాలుగు సంవ‌త్స‌రాల్లో రెండు సార్లు బీజేపీతో కాపురం చేయ‌డం.. రెండుసార్లు వ‌దిలేయ‌డం తెలిసిందే. అయితే.. ఇప్పుడు కూడా ఆయ‌న‌పై మోడీకి పెద్ద‌గా న‌మ్మ‌కాలు లేవ‌నే చెప్పా లి. ఏమైనా జ‌ర‌గొచ్చ‌నే వాద‌న జాతీయ రాజ‌కీయాల్లో వినిపిస్తోంది.

ఇప్ప‌టికే నితీష్ కూట‌మి నుంచి మైండ్ గేమ్ మొద‌లైంది. త‌మ నాయ‌కుడు నితీష్‌కు ప్ర‌దాన మంత్రి ప‌ద‌విని ఇచ్చేందుకు.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మి ప్ర‌య‌త్నించింద‌ని.. కానీ..తామే వ‌ద్ద‌న్నామ‌ని కూడా చెప్పుకొచ్చారు. అయితే, దీనిని కాంగ్రెస్ ఖండించినా.. ఏమో తెర‌వెనుక ఏం జ‌రిగిందో అనే చ‌ర్చ అయితే కొన‌సాగుతోంది. ఓ ఏడాది త‌ర్వాతైనా నితీష్ త‌న బుద్ధి చూపించే ప్ర‌య‌త్నం చేస్తే.. అది మోడీ స‌ర్కారుకు ఇబ్బందిగానే మార‌నుంది.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుపైనే మోడీ ఎక్కువ‌గా ఆధార‌ప‌డుతున్నార‌ని జాతీయ మీడియా వ‌ర్గాలు చెబుతున్నాయి. నితీష్‌ను న‌మ్ముకుంటే.. నిండా మునుగుతామ‌ని.. లేదా.. ఆయ‌న గొంతెమ్మ కోరిక‌ల‌ను నెర‌వేర్చాల్సి ఉంటుంద‌ని భావిస్తున్న కూట‌మి పార్టీల అగ్ర‌నేత‌లు కూడా చంద్ర‌బాబు వైపే చూస్తున్నా రు. ఇక్క‌డ విష‌యం ఏంటంటే.. నితీష్‌కు.. చంద్ర‌బాబు కు న‌లుగురు ఎంపీలు తేడా ఉండ‌డం. రేపు నితీష్ కాద‌న్నా.. ఆయ‌న వెడ‌లిపోయినా.. అవ‌స‌ర‌మైతే.. వేరే పార్టీని చేర్చుకున్నా బాబు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌ని బీజేపీ నాయ‌కులు లెక్క‌లు వేసుకుంటున్నారు. అందుకే చంద్ర‌బాబుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నార‌ని తెలుస్తోంది.