జగన్ ప్రమాణ స్వీకారం.. ఒక రేంజ్ ట్రోలింగ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడానికి ముందు విజయంపై ఇటు కూటమి, అటు వైసీపీ ధీమాతోనే కనిపించాయి. ఐతే ధీమా వ్యక్తం చేయడం వరకు ఓకే కానీ.. వైసీపీ వాళ్లు ఒక అడుగు ముందుకు వేసి విశాఖపట్నంలో రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని.. అందుకు ముహూర్తం కూడా పెట్టేశారని.. వేదిక కూడా సిద్ధమైందని.. హోటల్స్ అన్నీ కూడా బుక్ అయిపోయాయని తెగ ప్రచారం చేసుకున్నారు.

ఇంత అతి అవసరమా, రేప్పొద్దున ఫలితాలే తేడా కొడితే ట్రోలింగ్ తప్పదు అనే హెచ్చరికలు వచ్చినా వాళ్లు పట్టించుకోలేదు. చివరికి వాళ్లు అనుమానాలే నిజమయ్యాయి. వైసీపీ ఓడిపోయింది. అది కూడా మామూలుగా కాదు.. చిత్తు చిత్తుగా. దీంతో ఫలితాలు వెల్లడైన కొన్ని గంటల నుంచే వైసీపీ మీద ట్రోలింగ్ ఒక రేంజిలో జరుగుతోంది.

ముఖ్యంగా విశాఖపట్నంలో తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం గురించి వైసీపీ ఇంతకుముందు చేసిన హడావుడి మీద జరుగుతున్న ట్రోలింగ్ వేరే లెవెల్ అనే చెప్పాలి. జగన్ సహా వైసీపీ ముఖ్య నేతలు విశాఖలో ప్రమాణ స్వీకారం గురించి చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పెట్టిన పోస్టులన్నీ బయటికి తీసి.. కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు.

మొన్నట్నుంచే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు సిద్ధమని.. లక్షల్లో జనం వస్తున్నారని ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇక నిన్నేమో.. విశాఖలో ఈ వేడుకలు మహ గొప్పగా జరిగిపోతున్నాయని.. రోజంతా వైసీపీ వాళ్లను రోజంతా ఒక ఆట ఆడుకున్నారు. ఈ రోజు కూడా ఆ ఒరవడి కొనసాగుతోంది. అందుకే ఎన్నికలు అయిపోయాక, ఫలితాలు రావడానికి ముందు వైసీపీ వాళ్లు మరీ అంత అతి చేయాల్సింది కాదని.. ఫలితంగా ఇప్పుడు ఈ ఎగతాళిని ఎదుర్కోవాల్సి వస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.