బిగ్ బ్రేకింగ్: రామోజీరావు ఆస్తమయం

తెలుగు ప్రజలకు షాకింగ్ వార్తగా చెప్పాలి. మీడియా మొఘల్ ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు ఆస్తమించారు. సుదీర్ఘకాలంగా మీడియారంగాన్ని శాసించిన ఆయన ఇక లేరు. ఈనాడు దినపత్రికతో తెలుగు వార్తా ప్రపంచంలో సంచలనాల్ని నమోదు చేసిన ఆయన.. ఈటీవీ చానళ్లతో పాటు.. డిజిటల్ ప్రపంచంలోనూ ఆయన తనదైన మార్కు వేశారు. తెలుగు రాజకీయాల్లో ఆయన తనదైన మార్క్ ను వేశారు.

ఇటీవల గుండెకు స్టంట్ వేసిన అనంతరం.. ఈ నెల ఐదో తేదీన ఆయన అస్వస్థతకు గురయ్యారు. గచ్చిబౌలిలోని నానక్ రాం గూడలోని స్టార్ ఆసుపత్రిలో ఆయన్ను చేర్చారు. శ్వాస తీసుకోవటంలో ఆయన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇదిలా ఉండగా.. శుక్రవారం మధ్యామ్నం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వెంటిలేటర్ మీద పెట్టి వైద్యం చేసినా ఫలితం లేకపోయింది.

ఆయన కోలుకున్నట్లుగా కనిపిస్తూనే.. ఈ రోజు (శనివారం) తెల్లవారుజామున (4.50 గంటలకు) తుదిశ్వాస విడిచారు. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లో రామోజీ శకం పూర్తైందని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజానీకానికి ఆయన మీడియా సంస్థతో అంతో ఇంతో అనుబంధం ఉండటం ఆయనకు మాత్రమే చెల్లుతుంది. మొండివాడిగా.. తాను అనుకున్నది అనుకున్నట్లు చేయటం కోసం ఎంతకైనా అన్నట్లు వ్యవహరించే ఆయన రామోజీ ఇక లేరు. 88 ఏళ్ల వయసులో ఆయన కొంతకాలంగా ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.