వ‌ణికిస్తున్న రెడ్‌బుక్‌.. ప్ర‌స‌న్నం కోసం అధికారుల క్యూ!

అధికారం ఎవ‌రికీ శాశ్వ‌తం కాదు. ఓడ‌లు బ‌డ్ల‌వ‌డం.. బ‌డ్లు ఓడ‌ల‌వ‌డం రాజ‌కీయాల్లో కామ‌నే. ఎంత‌టి మ‌హామ‌హుల‌కైనా ప్ర‌జ‌ల చేతుల్లో ఓట‌మి త‌ప్ప‌లేదు. అధికారంలో ఉన్నామ‌ని విర్ర‌వీగితే పాతాళానికి ప‌డిపోవ‌డం ఖాయం. ఇక అధికారంలోని ప్ర‌భుత్వం అండ చూసుకుని రెచ్చిపోయే అధికారులు కూడా కాలం ఒకేలా ఉండ‌దు అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఏపీలోని ఇలాంటి కొంత‌మంది అధికారులు ఇప్పుడు వ‌ణికిపోతున్నార‌ని తెలిసింది.

జ‌గ‌న్ అండ‌తో, ఆదేశాల‌తో పోలీసులు, అధికారులు రెచ్చిపోయారు. టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మంగా కేసులు పెట్టార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అన్యాయంగా అరెస్టు చేశార‌నే అభిప్రాయాలున్నాయి. అంతే కాకుండా జ‌గ‌న్‌ను చూసుకుని అధికార పార్టీ నేత‌ల‌కు కొమ్ము కాశార‌నే విమ‌ర్శ‌లున్నాయి. ఇప్పుడు ఇలాంటి అధికారులంద‌రూ హ‌డ‌లెత్తిపోతున్నారు. కార‌ణం టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌లోని చేతిలోని రెడ్‌బుక్‌. జ‌గ‌న్ అండ‌తో టీడీపీ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెడుతూ, జ‌నాల‌ను అన్యాయంగా వేధిస్తున్న వాళ్ల పేర్ల‌ను రెడ్‌బుక్‌లో రాసుకుంటున్నాన‌ని లోకేశ్ గ‌తంలో చెప్పారు. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వీళ్ల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

లోకేశ్ పేర్లు రాసుకుంటే ఏముంది? అస‌లు టీడీపీ అధికారంలోకి రావాలి క‌దా? అని ఆ అధికారులు మ‌రింత బ‌రితెగించారు. కానీ ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి ఘ‌న విజ‌యంతో ఈ అధికారుల కాళ్ల కింద భూమి కంపించింద‌నే టాక్ వినిపిస్తోంది. ఎక్క‌డ త‌మ‌పైన చ‌ర్య‌లు తీసుకుంటారో అని ఇప్పుడు చంద్ర‌బాబు, లోకేష్‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి ఈ అధికారులు క్యూ క‌డుతున్న‌ట్లు తెలిసింది. జ‌గ‌న్ ఒత్తిడితోనే అలా వ్య‌వ‌హ‌రించామ‌ని చెప్పుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు టాక్‌. కానీ బాబు మాత్రం వీళ్ల‌ను అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన త‌ర్వాత చెప్పిన మాట ప్ర‌కారం ఈ అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు లోకేశ్ సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలిసింది.