తొలిప్రేమను గుర్తు చేసిన విజయం

100 శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గంటల వ్యవధిలోనే మంగళగిరిలో ఉన్న పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను, అభిమానులను కలుసుకున్నారు.

వాళ్లకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు. దీని కోసమే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆఘమేఘాల మీద గన్నవరం వచ్చిన పవన్ కు క్యాడర్ నుంచి ఘన స్వాగతం లభించింది. గత ఎన్నికల్లో జీరో నుంచి ఇప్పుడు హీరోగా ఎదగడం వెనుక పడిన కష్టం మొత్తం ఆనందంగా మారిన తరుణంలో పవన్ భావోద్వేగం కనిపించింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయం చూసి చాలా కాలమయ్యిందని, సినిమాలు చేసే టైంలో తొలిప్రేమ రూపంలో దాన్ని ఆస్వాదించానని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ అంత సక్సెస్, డబ్బు ఏదైనా ఇచ్చినట్టు గుర్తు లేదని అన్నారు. నిజానికి తొలిప్రేమ తర్వాత ఖుషి, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్లు పవన్ కున్నాయి. కానీ ప్రత్యేకంగా తొలిప్రేమనే ఎందుకలా ముద్ర వేసిందంటే అప్పటిదాకా చిరంజీవి తమ్ముడిగా మార్కెట్ కొనసాగిస్తున్న పవన్ కు సోలోగా యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్, రికార్డు వసూళ్లు తెచ్చి పెట్టి ఇమేజ్ ని మార్చేసింది కనక.

చిరస్మరణీయ ఘనత సాధించిన జనసేన అధ్యక్షుడిగా పవన్ ఎమోషన్ కొంత కాలం పాటు ఫ్యాన్స్ ని తీవ్రంగా వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు ఎవరు, అసెంబ్లీ గేటు దాటలేవు, ప్యాకేజీ స్టార్ అంటూ అధికార పక్షంతో నానా మాటలు అనిపించుకుని ఇప్పుడు అదే పార్టీని తన కన్నా సగం సీట్లోపే పరిమితం చేయడం వెనుక టిడిపితో కలిసి పన్నిన వ్యూహం అద్భుత ఫలితాన్ని ఇచ్చింది.

చేతిలో ఉన్న అయిదేళ్ళు చాలా బాధ్యతలు ఉన్నాయని, కక్ష రాజకీయాలకు దూరంగా పని చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో పెను సంచలనాత్మక నిర్ణయాలకు వారధి కాబోతున్నాడు.