అసెంబ్లీ వైపు మామా అల్లుళ్ళ అడుగులు

తెలుగుదేశం కూటమి విజయం వైపు పరుగులు పెడుతున్న వేళ మొదటి నుంచి ఆసక్తి రేపుతున్న కొన్ని నియోజకవర్గాల మీద పార్టీ కార్యకర్తలు ప్రత్యేక దృష్టి పెట్టారు. వాటిలో మొదటిది నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరి. గత ఎన్నికల్లో అక్కడ ఓటమి పాలైనప్పుడు అధికార వైసిపి మాములుగా టార్గెట్ చేయలేదు. కొన్ని సోషల్ మీడియా గ్రూపులు కేవలం ట్రోలింగ్ కోసమే పని చేశాయి. టిడిపి అధ్యక్షుడి వారసుడిగా దీన్ని కార్యకర్తలు అంత సులభంగా జీర్ణించుకోలేకపోయారు. కట్ చేస్తే పడిన చోటే లేవాలనే పంతంతో లోకేష్ తిరిగి అదే మంగళగిరిలో విజయం దక్కించుకునే ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇంకా రౌండ్లు బ్యాలన్స్ ఉన్నప్పటికీ లోకేష్ ఇప్పటికే పది వేలకు పైగా మెజారిటీ దాటేయడం చూస్తే గెలుపు లాంఛనమే. సులభంగా ఉండే చోటుని ఎంచుకోకుండా ఓటమి చెందిన ప్రాంతాన్నే సవాల్ గా తీసుకుని లోకేష్ చేసిన ప్రచారం, జనంలోకి తన ఉద్దేశాలను తీసుకెళ్లిన వైనం విజయలక్ష్మిని వరించేలా చేసింది. ఇక మావయ్య బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి హిందూపూర్ నిజయోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లడం ఖాయమని ఎర్లీ ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. వైసిపి తరఫున నిలబడిన దీపిక బాలయ్యకు ఆమడ దూరంలో ఉన్నట్టు నెంబర్లు స్పష్టంగా చెబుతున్నాయి.

మామా అల్లుళ్ళు బాలకృష్ణ, లోకేష్ లు ఒకేసారి అసెంబ్లీకు వెళ్లడం ఫ్యాన్స్ కి అరుదైన సందర్భంగా నిలిచిపోతుంది. చంద్రబాబు నాయుడు ఎలాగూ అధ్యక్ష పీఠంలో ముఖ్యమంత్రిగా ఉంటారు కనక ఈ కాంబినేషన్ మల్టీస్టారర్ ని మించి అనే స్థాయిలో కార్యకర్తలు ఫీలవుతారు. ప్రస్తుతం ఫలితాల కోసమే షూటింగుల నుంచి బ్రేక్ తీసుకున్న బాలకృష్ణ ప్రభుత్వం ఏర్పాటు జరిగాక, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసుకుని ఆ తర్వాత ఎన్బికె 109 సెట్లో అడుగు పెట్టొచ్చు. ఇక లోకేష్ దృష్టి ప్రత్యేకంగా మంగళగిరి వైపు ఉండనుంది. మంత్రిగా ఏ బాధ్యతలు దక్కుతాయనేది కొద్దిరోజులు ఆగితే తెలుస్తుంది.