శ్రీవారికి ముఖ్యమంత్రే వస్త్రాలు సమర్పించాలని లేదు: ఐవైఆర్

తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే అన్యమతస్థులు ఇకపై డిక్లరేషన్ సమర్పించనవసరం లేదంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటన ఇపుడు ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. డిక్లరేషన్ అనేది విశ్వాసానికి సంబంధించిన విషయమని, ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సంప్రదాయాన్ని ఇపుడు ఎందుకు తీసి వేస్తున్నారని ప్రతిపక్షాలు, హిందూ ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి చర్యల వల్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఉన్నపళంగా డిక్లరేషన్ అవసరం లేదన్న నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వైవీ సుబ్బారెడ్డి చెప్పాలని ఐవైఆర్ ట్వీట్ చేశారు.

ఈ నిబంధన ఈనాటిది కాదని, ఎన్నో సంవత్సరాలుగా టీటీడీలో కొనసాగుతోందని ఐవైఆర్ అన్నారు. తాను విద్యార్థిగా ఉన్నపుడు తిరమలను దర్శించుకున్నానని, ఆ సమయంలో దర్శనానికి వచ్చిన విదేశీయుడు డిక్లరేషన్ పై సంతకం పెట్టిన తర్వాతే దర్శనానికి అనుమతించారని ఐవైఆర్ గుర్తు చేసుకున్నారు. గతంలో సోనియా గాంధీ తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ పై చర్చ జరిగిందన్నారు. ఆ విషయంలో నాటి కార్యనిర్వహణాధికారి డిక్లరేషన్ కావాలని పట్టుబట్టడంతో కొందరు నేతల ఆగ్రహం వ్యక్తం చేశారని ట్వీట్ చేశారు. ఇపుడు హఠాత్తుగా ఈ మార్పునకు కారణమేంటో టీటీడీ చైర్మన్ చెప్పాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రే వస్త్రాలు సమర్పించాలని ఎక్కడా లేదని, నమ్మకం లేని నాడు ఆ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ మంత్రి నిర్వహించవచ్చని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు.

కాగా, తిరుమలను సందర్భించిన జగన్ ఏనాడు డిక్లరేషన్ పై సంతకం పెట్టలేదని చంద్రబాబు ఇటీవల అన్నారు. తాజాగా, ఈ నెల 23న తిరుమల బ్రహ్మాత్సవాల్లో శ్రీవారికి జగన్ పట్టుబట్టలు పెట్టబోతోన్న నేపథ్యంలోనే హడావిడిగా ఈ రూల్ తెచ్చారన్న వాదన సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇప్పటికే అంతర్వేది సహా బెజవాడ కనకదుర్గ ఘటనల నేపథ్యంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇపుడు తిరుమల విషయంలో మరోసారి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.