బీఆర్ఎస్ లో నైరాశ్యం !

భ‌విష్య‌త్ అంధ‌కారం.. అంతా ఆగ‌మ్య గోచ‌రం.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో షాక్‌.. ఇప్పుడు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో సున్నా.. ఇదీ బీఆర్ఎస్ ప‌రిస్థితి. తాజాగా వెలువ‌డ్డ ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌తో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దిమ్మ‌తిరిగింద‌నే చెప్పాలి.

మెజారిటీ స‌ర్వే సంస్థ‌లు తెలంగాణ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా ద‌క్క‌ద‌ని తేల్చేశాయి. ఒక‌ప్పుడు వెలుగు వెలిగిన బీఆర్ఎస్ ఇప్పుడు సున్నాకు ప‌డిపోయింద‌నే టాక్ వినిపిస్తోంది. ఈ సున్నా త‌ర్వాత బీఆర్ఎస్ ప‌రిస్థితి అంతా శూన్య‌మే అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

తెలంగాణ ఏర్ప‌డ్డాక తొలి ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫ‌లితాలు రాబ‌ట్టింది. ఉద్య‌మ పార్టీగా అప్ప‌టి టీఆర్ఎస్‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. అప్పుడు తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన పార్టీ.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 17 స్థానాల‌కు గాను 11 సీట్లు సాధించింది.

కానీ 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రెండు స్థానాలు కోల్పోయి 9 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. ఇప్పుడు ఆ 9 స్థానాలూ గ‌ల్లంత‌య్యే ప‌రిస్థితి నెలకొంది. గ‌తేడాది అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేవ‌లం 39 స్థానాల్లో మాత్ర‌మే గెల‌వ‌డంతో బీఆర్ఎస్ ప‌రిస్థితి త‌ల‌కిందులైంది. అప్ప‌టి నుంచి పార్టీకి గ‌డ్డు ప‌రిస్థితులు కొన‌సాగుతూనే ఉన్నాయి.

ఒక‌ప్పుడు వెలుగు వెలిగిన బీఆర్ఎస్‌.. ఇలా పాతాళంలోకి ప‌డిపోవ‌డానికి స్వ‌యంకృతాప‌రాధ‌మే కార‌ణ‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జ‌నం నాడీ తెలుసుకోకుండా అన్నీ త‌మ‌కే తెలుసు అనే అహంకారంతోనే కేసీఆర్ పార్టీ ప‌త‌నం దిశ‌గా సాగుతుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటూ ద‌క్కే అవ‌కాశం లేద‌న్న‌ది మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా. ఈ ఫ‌లితంతో బీఆర్ఎస్ ఉనికి మ‌రింత ప్రమాదంలో ప‌డింద‌నే చెప్పాలి. ఈ లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత బీఆర్ఎస్ నుంచి మ‌రింత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరే అవ‌కాశ‌ముంది. దీంతో చివ‌ర‌కు కేసీఆర్‌, కేటీఆర్ మాత్రమే మిగులుతార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.