ఆరా మస్తాన్ చరిత్ర తవ్వుతున్నారు

Aara Masthaan

ఆరా మస్తాన్.. నిన్నట్నుంచి సోషల్ మీడియాలో మార్మోగుతున్న పేరు. ఎన్నికల ఫలితాలపై సర్వేలు నిర్వహించే సంస్థలు చాలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లలో క్రెడిబిలిటీ సంపాదించుకున్న సర్వే సంస్థల్లో ‘ఆరా’ ఒకటి. దాన్ని నడిపించే మస్తాన్.. ప్రతి ఎన్నికల సమయంలోనూ ప్రి పోల్, పోస్ట్ పోల్ సర్వేలు ప్రకటిస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో ఆయన ప్రకటించిన ఫలితాల్లో కచ్చితత్వం కనిపించింది. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని ఆరా మస్తాన్ ప్రకటించారు. ఫలితాల తర్వాత అదే నిజమని తేలడంతో ఆయనకు క్రెడిబిలిటీ పెరిగింది.

ఐతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను ఆరా మస్తాన్ ఏ విధంగా ఇస్తారా అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూడగా.. ఆయన వైసీపీదే విజయమని.. ఆ పార్టీ 90కి పైగా సీట్లు సాధిస్తుందని ప్రకటించారు. కానీ క్రెడిబిలిటీ ఉన్న మెజారిటీ సర్వే సంస్థలు కూటమికే విజయాన్ని కట్టబెట్టగా.. మస్తాన్ ఇలాంటి ఫలితాలను ప్రకటించడం ఆశ్చర్యపరుస్తోంది.

దీంతో మస్తాన్ మీద టీడీపీ, జనసేన వాళ్లు యుద్ధం మొదలుపెట్టారు. మస్తాన్ ప్రకటించే ఫలితాలు అన్నిసార్లూ నిజం కావని.. ఆయన కొన్నేళ్ల కిందట జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ క్లీన్ స్వీప్ చేస్తుందన్నట్లు ప్రకటించారని.. కానీ బొటాబొటీ మెజారిటీతో గెలిచిందని.. మరి కొన్ని ఫలితాల విషయంలోనూ ఆయన తప్పుడు అంచనాలు వేశారని గుర్తు చేస్తున్నారు.

మస్తాన్ వైసీపీకి అమ్ముడుపోయారని కొందరు ఆరోపిస్తుండగా.. జగన్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు కూడా బయటపెడుతున్నారు. తన క్రెడిబిలిటీని పణంగా పెట్టి ఈసారి వైసీపీదే అధికారమని ఆయన ఫలితాలను మ్యానుపులేట్ చేసి ప్రకటించారని వారు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో ఆరా మస్తాన్ చరిత్ర తవ్వి తీస్తూ.. ఆయన గతంలో శ్రీకాంత్ హీరోగా ‘టెర్రర్’ అనే సినిమాను కూడా ప్రొడ్యూస్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, మస్తాన్ ఎవరికో బినామీ అని ఆరోపిస్తున్నారు. మొత్తానికి అసలు ఫలితాలు రావడానికి ముందు రాజకీయ నాయకుల కంటే ఆరా మస్తాన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయారు.