ముగిసిన స‌మ‌రం.. న‌రాలు తెగే ఉత్కంఠ‌!

దేశంలో 18వ పార్ల‌మెంటు ఎన్నిక‌లు.. అదేస‌మ‌యంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌రం ముగిసింది. నిజానికి భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇంత భారీ ఎత్తున ఎన్నిక‌లు జ‌రిగిన సంద‌ర్భాలు లేవు. ఏకంగా ఏడు ద‌శ‌లు.. రెండు మాసాల‌కు పైగా స‌మ‌యం.. వంటివి.. ఎప్పుడూ లేదు. మార్చి 15న కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసిన షెడ్యూల్ నాటి నుంచి ప్రారంభ‌మైన ఎన్నిక‌ల స‌మ‌రం.. తొలి ద‌శ నుంచి చివ‌రి ద‌శ అయిన 7వ ద‌శ వ‌ర‌కు కూడా అత్యంత ఉత్కంఠ‌గానే సాగింది. దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు ఎన్నిక‌లు ఒక ఎత్త‌యితే.. పార్ల‌మెంటు+అసెంబ్లీ ఎన్నిక‌లు మ‌రో ఎత్తుగా సాగాయి.

దేశం విష‌యాన్ని చూస్తే.. మునుపెన్న‌డూ లేని పోరు సాగింది. గ‌తంలో లేని హామీలు.. వివాదాలు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి. 17 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఎప్పుడూ కూడా.. రాజ్యాంగాన్ని రాజ‌కీయం చేసిన చ‌రిత్ర ఏ పార్టీ మూట‌గ‌ట్టుకోలేదు. కానీ, తొలిసారి ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ రాజ్యాంగాన్ని తెర‌మీదికి తీసుకువచ్చింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి అధికారంలోకి వ‌స్తే.. రాజ్యాంగాన్ని మార్చేస్తుంద‌ని.. ఎస్సీ,ఎస్టీ, ఓబీసీల‌కు ఉన్న రిజ‌ర్వేష‌న్లు తీసేసి. ముస్లింల‌కు ఇచ్చేస్తార‌ని.. దేశం ఒక‌ర‌కంగా క‌ల్లోలం అయిపోతుంద‌ని చెప్పారు. ఇక‌, దీనికి కౌంట‌ర్ ఇచ్చుకోలేక‌.. కాంగ్రెస్ పార్టీ త‌ల‌కిందులు ప‌డింది.

మ‌రీ ముఖ్యంగా పేద‌ల ఆస్తుల‌ను లాక్కుని. మ‌హిళ‌ల మంగ‌ళ‌సూత్రాలు తెంచేసి మ‌రీ ముస్లంల‌కు క‌ట్ట‌బెడ‌తార‌న్న మోడీ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. ఇక‌, పాకిస్థాన్ విష‌యంలో కాంగ్రెస్ బుజ్జ‌గింపు రాజ‌కీయాలు చేస్తోంద‌న్నారు. తాము వ‌స్తేనే.. పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌ను తిరిగి వెన‌క్కి తీసుకుంటామ‌న్నారు. మొత్తం.. దేశ ప్ర‌జ‌ల భావోద్వేగాల‌ను బీజేపీ ఇంత పెద్ద స్థాయిలో కుదిపేసిన సంద‌ర్భం మ‌న‌కు గ‌తంలో క‌నిపించ‌దు. కాంగ్రెస్ విష‌యాన్ని తీసుకుంటే.. పార్టీల‌తో జ‌ట్టు క‌ట్టినా.. చివ‌రి నిముషం వ‌ర‌కు మ‌మ‌తా బెన‌ర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వంటివారు త‌ట‌ప‌టాయిస్తూనే ఉన్నారు.

కొన్నికొన్ని రాష్ట్రాల్లో కూట‌మి పార్టీలు ఒంటరిగా బ‌రిలో నిలిచాయి. ఇది ఇండియా కూట‌మి ఐక్య‌త‌ను ప్ర‌శ్నార్థ‌కం చేసింది. మొత్తంగా ఇటు బీజేపీ, అటు కూట‌మి పార్టీల మ‌ధ్య పోరు నువ్వా-నేనా అన్న‌ట్టుగా సాగింది. మ‌రోవైపు.. రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ పోరును గ‌మ‌నిస్తే.. నాలుగు రాష్ట్రాల్లో పార్ల‌మెంటు+ అసెంబ్లీ ఎన్నిక‌లు ఒకే సారి జ‌రిగాయి. ఒడిశా, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ , సిక్కి, ఏపీ రాష్ట్రాల్లో రెండు ఎన్నిక‌లూ ఒకేసారి నిర్వ‌హించారు. వీటిలో ఒడిశా విష‌యానికి వ‌స్తే.. సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌ను అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్ననాయ‌కుడిగా ప్రొజెక్టు చేసేందుకు సాక్ష‌త్తూ ప్ర‌ధాని మోడీ ప్ర‌య‌త్నం చేయ‌డం వివాదానికి దారితీసింది. పూరి జ‌గ‌న్నాథుడి ర‌త్న భండాగారం తాళాలుకూడా రాజ‌కీయంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. ఎన్నికల్లో కీల‌క ప్ర‌చార అస్త్రంగా నిలిచాయి.

ఏపీ విష‌యం కూడా ఇలానే ఉంది. కూట‌మి పార్టీలు ఒక‌వైపు, వైసీపీ ఒంట‌రిగా మ‌రో వైపై బ‌ల‌మైన పోటీ ఇచ్చాయి. కూట‌మి పార్టీ సూప‌ర్ సిక్స్‌తో ముందుకు వ‌చ్చింది. వైసీపీ కూడా.. ఉచిత హామీల‌కు పెద్ద‌పీట వేసింది. అయితే.. ఈ రెండు క‌న్నా. కూడా ప్ర‌జ‌లను భ‌య‌పెట్టే రాజ‌కీయాల‌కు ఇరు ప‌క్షాలు తెర‌దీయ‌డం గ‌మ‌నార్హం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తీసుకువ‌చ్చిన జ‌గ‌న్‌.. ప్ర‌భుత్వం మీ భూములు లాగేసుకుంటాడ‌ని కూట‌మి పార్టీలు.. ప్ర‌చారం చేశాయి. ఒక‌ర‌కంగా ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు కూడా గురి చేశాయి. ఇదే స‌మ‌యంలో వైసీపీ కూడా.. జ‌గ‌న్ అధికారంలోకి రాక‌పోతే.. మీకు ఇప్పుడు అందుతున్న సంక్షేమం ఆగిపోతుంద‌ని.. చంద్ర‌బాబు వ‌స్తే.. రూపాయి కూడా ఇవ్వ‌డం భ‌య పెట్టే రాజ‌కీయాలే చేసింది. మొత్తంగా.. ఈ ఎన్నిక‌ల స‌మ‌రం ముగిసింది. ఇక‌, ఈ నెల 4న ఎవ‌రు విజేత‌లు.. ఎవ‌రు చేసిన క‌ష్టం ఫ‌లించింది.. అనేది తేల‌నుంది.