పిన్నెల్లిని వదలని TDP కార్యకర్త

మాచ‌ర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని.. ఈవీఎం ధ్వంసం ఘ‌ట‌న‌లు, హ‌త్యా య‌త్నాల ఘ‌ట‌న లు వెంటాడుతున్నాయి. మే 13న జ‌రిగిన పోలింగ్ స‌మ‌యంలో ఈవీఎం, వీవీప్యాట్ల‌ను ధ్వంసం చేసిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఎమ్మెల్యేను నిల‌దీసిన‌.. టీడీపీ ఏజెంట్ నంబూరి శేష‌గిరిరావుపై హ‌త్యా య‌త్నం జ‌రిగింది. స‌ర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్‌పైనా హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఈ మూడు ఘ‌ట‌న‌ల్లోనూ ఏ1గా పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి ఉన్నారు.

దీంతో ఆయ‌న ప‌రారు కావ‌డం.. పోలీసులు ఆయ‌న కోసం వెత‌క‌డం.. కానీ, ఆయ‌న మాత్రం ప‌ట్టుబ‌డ‌క పోవ‌డం ఇదంతా పెద్ద సినీ డ్రామాను త‌ల‌పించింది. ఎట్ట‌కేల‌కు హైకోర్టు నుంచి ముంద‌స్తు బెయిల్ వ‌చ్చే వ‌రకు కూడా.. పిన్నెల్లి ఎక్క‌డ ఉన్నార‌నేది మాత్రం ఎవ‌రూ గుర్తించ‌లేక పోయారు. క‌ట్ చేస్తే.. ముంద‌స్తు బెయిల్ వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆయ‌న ఎస్పీ కార్యాల‌యానికి రావ‌డం తెలిసిందే. అక్క‌డ రోజూ వ‌చ్చి సంత‌కం చేసి వెళ్లాల‌ని ఆదేశించ‌డంతోపిన్నెల్లి రోజూ వ‌స్తున్నారు.

ఇదిలావుంటే.. ఈ కేసు ఇక్క‌డితో ముగిసి పోలేదు. తాజాగా టీడీపీ ఏజెంట్ నంబూరి శేష‌గిరిరావు… సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని సుప్రీం కోర్టులో శేషగిరిరావు పిటిషన్ వేశారు. పిన్నెల్లికి హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలు రద్దుచేయాలని కోరారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై దాడి చేశారని పేర్కొన్నారు. కౌంటింగ్ రోజు కూడా హింసకు పాల్పడే ప్రమాదం ఉందని వివ‌రించారు.

దీంతోపాటు ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై మరో పిటిషన్ కూడా శేషగిరిరావు దాఖ‌లు చేశారు. ఈ కేసుల్లో ఆధారాలున్నా ఎమ్మెల్యే పేరు, అనుచరుల పేర్లు లేకుండా కేసు పెట్టారని పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులంటూ ఎమ్మెల్యేకు అనుకూలంగా కొంద‌రు పోలీసులు వ్యవహరించారని పేర్కొన్నారు. అంశాలన్నీ హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇచ్చిందని తెలిపారు. తీవ్ర ఘటనలు చోటు చేసుకున్నా.. ముంద‌స్తు బెయిల్ మంజూరు చేయ‌డం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ నేప‌థ్యంలో పిన్నెల్లి బెయిల్ ర‌ద్దు చేసి త‌క్ష‌ణ‌మే అరెస్టు చేయించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరారు.