పోస్ట‌ల్ బ్యాలెట్‌.. ఎన్నిక‌ల సంఘం యూట‌ర్న్‌

ఏపీలో తీవ్ర వివాదంగా మారిన‌..ఉద్యోగులు, దివ్యాంగులు, వృద్ధులు(85 ఏళ్లు  పైబ‌డిన‌) వినియోగించుకున్న పోస్ట‌ల్ బ్యాలెట్ విష‌యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం కొన్ని గంట‌ల్లోనే యూట‌ర్న్ తీసుకుంది. దీనికి సంబంధించి ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తీసుకున్న నిర్ణ‌యాన్ని తొలుత స‌మ‌ర్థించిన ఎన్నిక‌ల సంఘం.. ఈ కేసు హైకోర్టు కు వెళ్లే స‌రికి యూట‌ర్న్ తీసుకుని.. స‌ద‌రు మీనా తీసుకున్న‌నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుని ర‌ద్దు చేస్తున్న‌ట్టుకు తెలిపింది. దీంతో ఏపీలో అస‌లు ఏం జ‌రుగుతుంద‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది.

ఏం జ‌రిగింది?

రాష్ట్రంలో 4 ల‌క్ష‌ల 97 వేల 620 మంది పోస్ట‌ల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. వీరిలో మెజారిటీగా 3.8 ల‌క్ష‌ల మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే.. ఇది త‌మ‌కు అనుకూలంగా ఉంటుంద‌ని టీడీపీ ఆది నుంచి చెబుతూ వ‌చ్చింది. దీంతో నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌మదే విజ‌య‌మ‌ని భావించిన వైసీపీ నేత‌ల గుండెల్లో గుబులు పుట్టించింది. దీంతో నిబంధ‌న‌ల మేర‌కు.. పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌ను లెక్కించాల‌ని చెబుతూ వ‌చ్చింది. అయితే.. ప్ర‌జాస్వామ్యంలో ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డం ముఖ్యం కాబ‌ట్టి.. కొన్ని నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించాల‌ని టీడీపీ విన్న‌వించింది. దీంతో ఏపీ ఎన్నిక‌ల అధికారిగా ఉన్న మీనా నిబంధ‌న‌ల‌ను స‌వ‌రిస్తూ.. మెమో ఒక‌టి జారీ చేశారు.

ఏంటి నిబంధ‌న‌..

పోస్ట‌ల్ బ్యాలెట్ వినియోగించుకునేవారి విష‌యంలో కొన్ని నిబంధ‌న‌లు ఉన్నాయి. పోస్ట‌ల్ బ్యాలెట్‌పై అటెస్టేష‌న్ అధికారి సీల్ వేయాలి. 2) ఆయ‌న చేతి రాత‌తో సంత‌కం చేయాలి. ఉద్యోగి కూడా అలానే సంత‌కం చేయాలి.

ఏం స‌వ‌రించారు..

పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే స‌రిపోతుంద‌ని. సీల్ లేకపోయినా ఫర్వాలేదని,  హోదాను చేతిరాతతో రాయకపోయినా ఏమీ కాద‌ని పేర్కొన్నారు.

ఇదీ వివాదం..

ఇలా .. సీఈవో మీనా.. మార్పులు చేయ‌డాన్ని వైసీపీ నిల‌దీసింది. ఇలా ఎందుకు మారుస్తున్నార‌ని ప్ర‌శ్నించింది. ఇలా చేయ‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసింది. దీనికి ఈసీ నుంచి స‌మాధానం వ‌చ్చింది. మీనా ఇచ్చిన ఉత్త‌ర్వులు.. స‌రైన‌వేన‌ని తెలిపింది.

కోర్టులో మాట మార్పు..

అయితే.. వైసీపీ  ఈ వివాదాన్ని కోర్టుకు తీసుకువెళ్లింది. అక్క‌డ‌కు వెళ్లే స‌రికి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం యూట‌ర్న్ తీసుకుని.. పోస్టల్ బ్యాలెట్ పై అటెస్టేషన్ అధికారి సీల్ లేకపోయినా ఫర్వాలేదంటూ ఏపీ సీఈవో  ఇచ్చిన మెమోను వెన‌క్కి తీసుకుంది.  పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం(13ఏ)పై అటెస్టింగ్ అధికారి సంతకం చేయాల‌ని..   స్టాంప్ వేయాల‌ని తెలిపింది.  అలాంటి పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలని తెలిపింది.  అయితే.. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ఎందుకంటే.. మ‌రోసారి తామే ఉత్త‌ర్వులు జారీ చేస్తామ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం తెలిపింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.